(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాజధాని అమరావతికి సంబంధించిన పలు పిటిషన్లపై ఏపి హైకోర్టులో సోమవారం వాదనలు ముగిసాయి. అనుబంధ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ఇరపక్షాలు ధర్మసనానికి వాదనలు వినిపించారు.
విశాఖ గెస్ట్ హౌస్ వివరాలను కౌంటర్లో దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. విశాఖలో గెస్ట్ హౌస్ను రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తూ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్ హౌస్ ల కు సంబందించి పూర్తి వివరాలు అఫిడవిట్ లో పేర్కొనలేదనీ, విశాఖలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదని అన్నారు. ప్రభుత్వ నిర్మాణాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవనీ, ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్ హౌస్ లు చాలా విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నారనీ, దాని వల్లే అనుమానాలు వస్తున్నాయని అన్నారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.
దీనిపై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సమాధానం ఇస్తూ రాజధానిలో భాగంగా విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం చపట్టడం లేదని ధర్మాసనానికి తెలియజేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్న కారణంగానే గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపట్టామని అన్నారు. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణ అంశంపై తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం రాజధాని సంబంధిత ప్రధాన పిటిషన్లపై నవంబర్ 2వ తేదీ నుండి రోజు వారీ విచారణ చేపడతామనీ, అవసరమైతే శని, ఆదివారాల్లో కూడా వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.