ఏపీ రాజధాని కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరస్పర విమర్శలు – ఎత్తుగడలు ఎలా ఉన్నా ఈ ఎపిసోడ్లోకి సినీ ప్రముఖులు ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, ప్రభుత్వం వాటికి తగిన నష్ట పరిహారం చెల్లించాలని కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అశ్వనీదత్ ఏం కోరారంటే…
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు గతంలో చేపట్టి భూ సేకరణ విషయంలో అశ్వనీదత్ న్యాయస్థానం తలుపుతట్టారు. ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం తనకు చెందిన 39 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తీసుకుందని అశ్వనీదత్ పిటిషన్లో పేర్కొన్నారు. ఎకరా రూ.1కోటి 54లక్షలు ఉంటుందని దానికి సరిసమానమైన భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు రాజధాని తరలింపుతో అక్కడ విలువ పడిపోయిందని… కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మొత్తం రూ.210కోట్లు ప్రభుత్వం తనకు పరిహారంగా చెల్లించాలన్నారు.
రెబల్ స్టార్ పిటిషన్లో ఏముందంటే…
గన్నవరం ఎయిర్పోర్టు భూ సేకరణ కోసం ప్రభుత్వం తన 31 ఎకరాల భూమిని తీసుకుందని కృష్ణంరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇంతలోనే మరో ప్రభుత్వం అధికారంలోకి రావడం.. రాజధాని తరలింపుకు సిద్ధమైన నేపథ్యంలో.. నష్టపరిహారం చెల్లింపుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఈ పిటిషన్ విచారించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, ఏపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
హాట్ టాపిక్గా అశ్వనీదత్
విమానాశ్రయ విస్తరణ నేపథ్యంలో 39 ఎకరాలు భూమిని ఇచ్చినట్లు పేర్కొన్న నిర్మాత చలసాని అశ్వనీదత్ అందుకుగానూ భూ సేకరణ చట్టం ప్రకారం రూ.210 కోట్లు తనకు చెల్లించేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో చర్చగా మారింది. ఈ విషయంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? అంతకంటే ముందు ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తుంది? అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠకు కారణంగా మారిన అంశం. వివిధ వర్గాల అంచనా ప్రకారం, అశ్వనీదత్ ఆకాంక్ష నెరవేరకపోవచ్చునని అంటున్నారు.
అశ్వనీదత్కు న్యాయం జరిగేనా?
రాజధాని తరలింపు నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న భూమి విలువకుగానూ తనకు పరిహారంగా నాలుగు రెట్లు చెల్లించేలా చూడాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని నిర్మాత అశ్వనీదత్ ఆశ్రయించగా అదే అంశం ఆధారంగా ఆయనకు న్యాయం జరగకపోవచ్చునని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజధానిని మార్చడం లేదు. పరిపాలన వికేంద్రీకరణ విధానంలో భాగంగా మరో రెండు చోట్లకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ వాదనను అఫిడవిట్ రూపంలో వివరిస్తే కోర్టు దానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు అశ్వనీదత్ ఆకాంక్ష నెరవేరకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.