Ashok Gajapathi Raju: రామతీర్ధం ఘటన నేపథ్యంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు హజరుకావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. కాగా దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. తన పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అశోక్ గజపతిరాజు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Ashok Gajapathi Raju: శంకుస్థాపన ఫలకాన్ని తొలగించే ప్రయత్నంపై
రామతీర్ధం బొడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణ పనుల భూమి పూజ సందర్భంగా సంప్రదాయాలకు విరుద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన ఫలకాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, అధికారులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా శంకుస్థాపన ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ చర్యలను అశోక్ గజపతిరాజు విమర్శించారు. అశోక్ వ్యాఖ్యలకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలు కౌంటర్ ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆలయ ఇఓ వెళ్లి చెప్పినా కావాలనే రాద్ధాంతం చేశారని విమర్శించారు.
అయితే అక్కడ జరిగిన ఘటనను పురస్కరించుకుని ఆలయ ఇఓ ప్రసాద్ నెలిమర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విధులను ఆటంకం కల్గించారని ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీ 427, 353 కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు తాజాగా సీఆర్పీసీ 41 కింద నోటీసు అందజేశారు. ఆలయాల నిధులను వేరే వాటికి మళ్లించడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశాననీ, అందుకే ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు పాల్పడుతోందని అశోక్ గజపతిరాజు ఆరోపించారు.