అమరావతి: అసెంబ్లీ ఫర్నీచర్ను మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంకు చెందిన గౌతం హోండా షోరూమ్ లో ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అసెంబ్లీ సిబ్బంది శుక్రవారం షోరూమ్లో తనిఖీలు చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ అంశంపై షోరూమ్ సిబ్బందిని విచారించారు.
అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకువెళ్లాలని తాను ఇప్పటికే అసెంబ్లీ అధికారులకు లేఖ రాసినట్లు కోడెల శివప్రసాద్ ప్రకటించిన విషయం విదితమే. ఏపి అసెంబ్లీ నుండి విలువైన ఫర్నీచర్ మాయమైందనీ, కోడెల స్పీకర్గా ఉన్నప్పుడే ఇది జరిగిందనీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఫర్నీచర్ విలువ సుమారు కోటి రూపాయలకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిజాం కాలం నాటి టేబుళ్లు, కుర్చీలతో పాటు బర్మా టేకుతో చేసిన టేబుళ్లు, డిజైన్ కుర్చీలు, సోఫాలు తదితర ఫర్నీచర్ మాయమైనవాటిలో ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అసెంబ్లీ అధికారులు శుక్రవారం రెవెన్యు, పోలీసుల సహకారంతో రవాణా శాఖ అధికారులు ఇటీవల సీజ్ చేసిన కోడెల కుమారుడి షోరూమ్ తాళాలు తీయించి పంచనామా నిర్వహించి అక్కడ ఉన్న అసెంబ్లీ ఫర్నీచర్ను స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే షోరూం వద్ద తనిఖీ లు నిర్వహించేందుకు కోడెల న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.షోరూం లో తనిఖీ చేయడానికి లిఖిత పూర్వక ఉత్తర్వులు లేనికారణంగా తనిఖీ చేయడానికి వీలు లేదని న్యాయవాది స్పష్టం చేయడం తో అసెంబ్లీ అధికారులు వెనుతిరిగారు.
కాగా తనపై వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందనీ కోడెల శివప్రసాదరావు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా తన నివాసంలో రాత్రి కంప్యూటర్లు చోరీ అయ్యాయని కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. అవి ఆయన ఇంటి సమీపంలోనే దొరికాయి. దీనిపై కోడెల మాట్లాడుతూ వైసిపి కార్యాలయంలో పని చేసే వ్యక్తే తన నివాసంలో కంప్యూటర్ల చోరీకి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయమై డిఎస్పితో మాట్లాడాననీ, ఆ వ్యక్తి తన ఇంట్లోని కంప్యూటర్లను ఎందుకు తీసుకువెళ్లాడో, అతని వెనుక ఎవరున్నారో తనకు తెలియాలన్నారు. తనపై కక్షతోనే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కోడెల ఆరోపించారు.
కోడెల ఆరోపణలను వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు. అర్జున్ అనే వ్యక్తి తన ఇంట్లో కంప్యూటర్ చోరీ చేసినట్లు కోడెల పేర్కొంటున్నారనీ, ఆ వ్యక్తి తన వద్ద గానీ, తమ పార్టీలో ఆఫీసులో గానీ పని చేయడం లేదని రాంబాబు చెప్పారు. కోడెల వద్ద ఆ వ్యక్తి గతంలో పని చేసిన విషయం తనకు తెలియదని తెలిపారు. అతను మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అని తనకు తెలిసిందని అంబటి అన్నారు. అతన్ని తాను చోరికి పంపానని కోడెల ఆరోపించడం విడ్డూరంగా ఉందని అంబటి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారు సత్తెనపల్లిలో శిక్షణ కోసం 30 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే వాటినీ కోడెల కుటుంబ సభ్యులు కనిపించకుండా చేశారని అంబటి అన్నారు. కంప్యూటర్ల అదృశ్యంపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రాత్రికి రాత్రి 29 కంప్యూటర్లు ప్రత్యక్షమయ్యాయని అంబటి అన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ను అధికారులు హీరో హోండా షోరూమ్లో స్వాధీనం చేసుకునేందుకు సన్నద్ధం అయ్యారని, అసెంబ్లీ ఫర్నీచర్ షోరూమ్లో ఉండటమేమిటని అంబటి ప్రశ్నించారు. దొంగిలించిన సొత్తు ఇచ్చినంత మాత్రన కేసు మాఫీ కాదనీ, శిక్ష అనుభవించాల్సిందేనని అంబటి పేర్కొన్నారు.