Assembly Polls 2022: దేశంలోని మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఓకే దశలో పోలింగ్ నేడు జరుగుతుండగా, యూపీలో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని 55 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ చేపట్టారు. యూపీలో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గోవా రాష్ట్రంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 11,56,464 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 301 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని గోవా ఓటర్లు నిర్ణయించనున్నారు. ఉదయాన్నే గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన సతీమణి రీతా శ్రీధరన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తలై గోవా అసెంబ్లీ నియోజకవర్గంలోని 15వ పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవాలో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీ అభ్యర్ధుల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. సీఎం ప్రమోద్ సావంత్, ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్, మాజీ సీఎం చుర్చిల్ అలీమావో, మాజీ సీఎం కుమారుడు ఉత్పల్ పారికర్ లు పోటీ చేస్తున్నారు.
Assembly Polls 2022: పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరుతున్నఓటర్లు
ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఓకే విడతలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. ఉత్తరాఖండ్ ఎన్నికల బరిలో 632 మంది అభ్యర్ధులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 82,38,187 మంది ఓటర్లు నేడు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ తొలి సారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు బీజేపీ మంత్రులు, కాంగ్రెస్ మాజీ సీఎం హరీష్ రావత్, ఆప్ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ఉదయం నుండి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు.
కాగా గోవా, ఉత్తరాఖండ్ సహా ఉత్తరప్రదేశ్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అర్హులైన వారంతా రికార్డు స్థాయిలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని మోడీ సూచించారు.