సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణలో 180 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 1,800 మందికిపైగా పౌరులు, బలగాల సైనికులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి రాయబారి వోల్కర్ పెర్తేస్ తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మృతుల్లో అల్బర్ట్ అనే భారతీయుడు ఉన్నారు. రాజధానిలోని సైనిక ప్రధాన కార్యాలయం వద్ద భీకరంగా కాల్పులు జరిగాయి. పలు చోట్ల ఇళ్లను దోచుకుంటుండటం, విద్యుత్ సరఫరా స్తంభించిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఖార్తూమ్ విశ్వ విద్యాలయంలోని గ్రంధాలయంలో 88 మంది విద్యార్ధులు, సిబ్బంది మూడు రోజులుగా చిక్కుకుపోయారు. ఈ పరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని సూడాన్ లోని భారతీయులకు భారత దౌత్య కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఎలాంటి సాయం కావాలన్నా 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ను 1800 11 8797, 91 11 23012113, 91 11 23014104, 91 11 23017905 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
సుడాన్ లో 2021 అక్టోబర్ లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుండి అత్యున్నత మండలి అధికారం చెలాయిస్తొంది. అయితే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారం అప్పగించే విషయంలో ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఖార్టుమ్ లోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రాయాన్ని, ఇతర కీలక ప్రాంతాలు తమ ఆధీనంలోనే ఉన్నట్లు సైన్యం, పారా మిలటరీ బలగాలు ప్రకటించుకున్నాయి. వరుసగా మూడు రోజులు సూడాన్ పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లింది.