తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఇటీవలే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన సంగతి తెలిసిందే. పార్టీ తరఫున బలంగా గలం వినిపించడం, ఉత్తరాంధ్ర కావడం ఆయనకు కలిసి వచ్చిన అంశాలు.
కొత్త పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అచ్చెన్నాయుడు ఎప్పట్లాగే తమ రాజకీయ ప్రత్యర్థి, ఏపీ సీఎం జగన్ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు దానికి తెలంగాణ సీఎం కేసీఆర్కు లింక్ పెట్టారు.
నెలల నిరీక్షణకు బ్రేక్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన తెలంగాణ-ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు రవాణా అంశంలో చర్చలు జరిగి ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండిల సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎ.పి.ఎస్.ఆర్.టి.సిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ను సైతం తమ వివాదంలోకి లాగారు.
జగన్ అనాలోచిత నిర్ణయం
ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అనాలోచితం అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. “ ఈ ఒప్పందం ప్రజలకు అసౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. 2,65,367 కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతున్న ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ఇప్పుడు 1,04,368 కిలోమీటర్లు కోల్పోవడానికి కారణం ప్రభుత్వ చేతకానితనం కాదా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రోజుకి లక్ష కిలోమీటర్లు, 250 బస్సులు నడిపే హక్కును ఎ.పి.ఎస్.ఆర్.టి.సి కోల్పోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం కాదా? ప్రజలకు సేవలు విస్తృతం చేయాల్సిన సమయంలో సర్వీసులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏమిటి?“ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అంతా నష్టమే…
లక్ష కిలోమీటర్ల మేర తగ్గించుకోవడంతో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి మరింత నష్టపోవడంతో పాటు కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. “జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాలంటే రాష్ట్ర ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థతి నెలకొంది. “అని కామెంట్ చేశారు. కాగా, అచ్చెన్నాయుడు కామెంట్లపై తెలంగాణ నేతలు ఏ విధంగా స్పందిస్తారో మరి.