ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో అచ్చెన్నాయడు అరెస్ట్ వ్యవహారంపై రాజకీయ నాయకుల స్పందనలు హోరెత్తుతున్నాయి. ‘తప్పు చేస్తే శిక్షవిధించాల్సిందే కానీ, ఈ తరహా అరెస్ట్ మాత్రం సబబు కాదు’ అన్న అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు టీడీపీ సీనియర్ నేత, శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కింజరాపు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమే అసలు సిసలైన రాజకీయమని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది
‘వియ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్లో వుంది. టీడీపీలో సీనియర్ లీడర్ అయినా, సోషల్ మీడియాలో అచ్చెన్నాయుడికి పెద్దగా ఫాలోయింగ్ లేదు . అలాంటిది, ఒక్క అరెస్ట్తో సీన్ మారిపోయింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.
‘వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలను వేధింపులకు గురిచేస్తోంది’ అంటూ ట్వీట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇదంతా టీడీపీ మద్దతుదారుల ఉత్సాహమే కావొచ్చుగాక. కానీ, అనూహ్యంగా కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తీరుపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మంచో.. చెడో.. పబ్లిసిటీ అయితే వచ్చిపడింది.బహుశా ఈ స్థాయిలో తన పేరు మార్మోగిపోతుందని అచ్చెన్నాయుడు కూడా ఊహించి వుండరేమో. ‘వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి జరిగిందంటూ అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి విషయాల్లో యాగీ చేసిన వైసీపీ, 150 కోట్ల కుంభకోణం అని చెబుతున్న ఈఎస్ఐ మెడికల్ స్కాము విషయంలోనూ, మజ్జిగ ప్యాకెట్ల విషయంలోనూ దూకుడు ప్రదర్శి౦చి.. మిగతా అంశాల్ని అటకెక్కించడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.జగన్ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితే!