టిడిపి అగ్ర నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ టార్గెట్ అని అర్ధమైపోయింది. ఆయన బెయిల్ మీద వచ్చినా కూడా విపక్షంలోనే ఉన్నారు.
పైగా ఇదివరకులా పెద్ద నోరు చేసుకోలేరు. అలా కనుక చేసుకుంటే జగన్ సర్కార్ ఏం చేస్తుందో శాంపిల్ ఒకటి చూపించింది. ఈ పరిణామాల నేపధ్యంలో అచ్చెన్నాయుడు కొత్త రాజకీయమే మొదలెడతారు అంటున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా ఆ రాజకీయం ఉంటుందని కూడా తెలుస్తోంది. మరీ వెర్రి ఆవేశానికి పోయి అధినాయకత్వానికి వీర విధేయత చూపిస్తే తాను బుక్ అవుతాను అన్న సత్యాన్ని కూడా ఆయనకు ఈ అరెస్ట్ ఎపిసోడ్ ద్వారా అర్ధమైపోయిందని అంటున్నారు. అచ్చెన్నాయుడు అంటే చంద్రబాబుకు వెన్ను దన్ను అన్న సంగతి తెలిసిందే. అలాగే బాబు అంటే కూడా అచ్చెన్నాయుడు వీర విధేయత. భక్తి ప్రపత్తులు చాలా ఎక్కువే.ఈ కారణంగానే అచ్చెన్నాయుడు అష్టకష్టాలు పడ్డారు.
ఈఎస్సై కుంభకోణం లో అరెస్టై సుమారు మూడు నెలలపాటు రిమాండ్లో మగ్గారు. ఇన్ని రోజులు ఆయన బయట ప్రపంచం చూడలేదు.ఇపుడు కూడా కేసు అలాగే ఉంది. పైగా గట్టిగా బిగుసుకుని ఉంది. ఈఎస్ ఐ స్కాం లో అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని ఏసీబీ నిగ్గు తేల్చిన వేళ బెయిల్ వచ్చినా కేసు కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో అచ్చెన్న తీరు ఎలా ఉంటుంది అన్నది ఒక చర్చగా ఉంది. చంద్రబాబు మీద ఈగ వాలకుండానే నోరు చేసుకునే అచ్చెన్నాయుడు ఇకమీదట కూడా అలాగే ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇలా అరెస్ట్ అయి అలా బయటకు వచ్చేస్తాడు అనుకున్న అచ్చెన్న లాంటి బిగ్ షాట్ కే చుక్కలు కనిపించాయి.
ఈ సందర్భంగా టిడిపి పరంగా కూడా ఆయనకి పెద్ద మద్దతు లభించలేదు.చంద్రబాబుతో సహా టిడిపి నేతలు కొందరు ఆయనకు సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం తపితే చేసిందేమీ లేదని అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులే లోలోపల బాధ పడుతున్నారని సమాచారం.ఇంతగా టిడిపిని చంద్రబాబును వెనకేసుకొచ్చి ఇంకా కష్టాలు పడడం ఎందుకన్నఆలోచనల్లోకి వారు వచ్చేశారట! కాబట్టి ఇకపై అచ్చెన్నాయుడు రాజకీయ అవతారం మరోలా ఉంటుందని. పరిశీలకులు చెబుతున్నారు.ఇంతకు ముందు మాదిరి అచ్చెన్నాయుడు ‘సైకిల్ ‘ను వేగంగా,బలంగా తొక్కేపరిస్థితి మాత్రం ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు.జైలు జీవితం అచ్చెన్నాయుడుకు కొత్త కొత్త పాఠాలు నేర్పిందని చెప్పవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?