ATM Rules 2021: ఏటిఎంల నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఏటిఎం నిబంధనల్లో కొన్ని మార్పులను ప్రకటించింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఇంటర్ ఛేంజ్ ఫేజ్ ను రూ.2లకు పెంచుకునేందుకు ఆర్ బీ ఐ అవకాశం ఇచ్చింది. దీంతో వచ్చే అగస్టు 1వ తేదీ నుండి ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15ల నుండి రూ.17కు పెంచనున్నది. అన్ని ఏటిఎం కేంద్రాల్లో ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుండి రూ.6కు పెరగనుంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు సుమారు 90 కోట్ల వరకూ వినియోగంలో ఉన్నాయి. ఆర్ బీ ఐ సవరించిన నిబంధనల ప్రకారం అకౌంట్ దారులు తమ హోం బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెలా అయిదు ఉచిత లావాదేవీలను పొందవచ్చు. ఆ తరువాత ప్రతి లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో ఉచిత లావాదేవీలు మూడు వరకూ పొందవచ్చు. 2019 జూన్ నెలలో ఆర్ బీ ఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులు జరిగాయి. వినియోగ చార్జీలను ప్రతి లావాదేవీకి రూ.21 కు పెంచడానికి అనుమతించారు. ఈ పెరుగుదల 2022 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని ఆర్ బీ ఐ ఓ సర్క్యులర్ లో వెల్లడించింది. బ్యాంకు లావాదేవీలు నెలవారీ పరిమితిని మించితే 2022 జనవరి 1 వ తేదీ నుండి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది.
కాగా ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా 115,605 అన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ లైన్ ఏటీఎంలు ఉన్నాయని ఆర్ బీ ఐ నివేదికలో తెలిపింది.