YSRCP : బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించేది లేదని ఓవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్గా చెబుతున్నారు.
అయినా గాని, కొందరు రాజకీయ పెద్దలు.. నామినేషన్ వేస్తున్న వారిని బెదిరించి, పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా వైసిపి నేతలు ముందు వరుసలో ఉన్నారు.సాధ్యమైనన్ని ఏకగ్రీవాలు చెయ్యాలని వైసిపి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో వారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలో వారు తమ హద్దులు దాటుతున్నారు .నేరుగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకో వారి బంధువులకో ఫోన్లు చేసి మరీ ఎన్నికల బరి నుండి తప్పుకోవాలని హెచ్చరిస్తున్నారు.ఈ తరహాలో అభ్యర్ధులను బెదిరించిన ఘటనలు, ఆడియో కాల్స్ సైతం బయటకొచ్చాయి. ప్రస్తుతం యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు.. ఓ అభ్యర్ధిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని చెబుతున్న ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
YSRCP : కన్న బాబు వార్నింగ్ ఏ స్థాయిలో ఉందంటే?
తన నియోజకవర్గ పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడికి యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ చేశారని అభ్యర్ధి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసినందుకు కేసు పెట్టించి జైల్లో వేయిస్తానని ఎమ్మెల్యే బెదిరించారని అభ్యర్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వారి కథనం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడుకు కన్నబాబు ఫోన్ చేశారు. మీ మావయ్య 10వ వార్డుకు నామినేషన్ వేశాడట. కేసు పెట్టించి బొక్కలో వేయించేస్తా.. తర్వాత నీవు ఇబ్బంది పడతావ్. నీపై చాలా కేసులు ఉన్నాయి. చూసుకో. అని సంతోష్ను ఫోన్లో బెదిరించారు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అచ్చెన్నాయుడు విషయంలో అలా -అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఇలా!
ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే,టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు బెదిరించినట్టుగా ఆరోపిస్తున్న ఆడియో బయటపడటంతో అతనిపై కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కన్నబాబును కూడా అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు. అధికార పార్టీకి ఓ న్యాయం.. ప్రతిపక్షానికి ఓ న్యాయమా అంటూ పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.
కిషన్ రెడ్డి దృష్టికి రాష్ట్ర పరిణామాలు:సోము వీర్రాజు
ఏకగ్రీవాలు సహజంగా జరగాలి అని.. ప్రభుత్వ ఒత్తిడితో కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి అన్ని విషయాలు చెప్పామన్నారు. ఆయన తగు చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు.