నిరుపేదలకు ఇళ్ల పట్టాల పథకాన్ని సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్నారు. అయితే అనేక వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో ఇళ్ల పట్టాల అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాలోని ‘ఆవ’ భూముల వివాదం అందరికీ తెలిసిందే. తక్కువ ధరకు ఉండే భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి పెద్ద కుంభకోనానికి తెరతీశారని, ఇవి పేదలకు ఇళ్లపట్టాలుగా ఇవ్వడానికి కూడా పనికి రావని, ఇక్కడ పేదలకు నివాసయోగ్యం కాదంటూ కోర్టు లో పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. అయితే ఈ భూముల విష యంలో బయటపడిన తాజా అంశం ఒకటి ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నదా? అధికారులు తప్పటడుగులు వేశారా? ఆ జిల్లా అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారా? అనే కొత్త అనుమానాలకు తావిస్తోంది. అదేమిటో చూద్దాం…
కోరుకొండ మండలం బూరగపూడి సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూమి పూర్తిగా నీట మునిగింది. జిల్లాలో కురిసిన ఓ మోస్తరు వర్షానికే దాదాపు 587 ఎకరాల భూమి ముంపునకు గురి అయ్యింది. ఆ భూములకు ముందు భాగంలో నాలుగు అడుగులు లోతు, మధ్యలో పది అడుగుల లోతు వరకు వర్షపు నీరు చేరింది. బూరుగుపూడి, కోరుకొండ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు.. ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం సేకరించిన ఆ భూముల పరిస్థితిని సోమవారం మీడియాకు చూపుతూ ఆ భూముల్లో నిల్చిన నీటిలోకి దిగి మరీ చూపించారు. ఈ భూములను ఇళ్ల పట్టాలుగా ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి భూముల సేకరణపై స్థానిక ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, లబ్ధిదారుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. సుమారు 20వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ భూములను సేకరించారు అధికారులు. ఆ భూముల కొనుగోలుకు సంబంధించి కొందరికి ఇప్పటికే ఎకరానికి 45 లక్షల రూపాయల వంతున పరిహారం కూడా చెల్లించారు. ఈ ప్రాంతంలో ముంపు అధికం అని ఇరిగేషన్ శాఖ నివేదిక ఇచ్చినప్పటికీ అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇళ్ల పట్టాల కోసం ఆ భూములను సేకరించారని సమాచారం.
ఇళ్ల పట్టాలకు అర్జీలు పెట్టుకున్న రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంత లబ్ధిదారులు ఆవ భూముల పరిస్థితి చూడాలని ఓ రైతు అక్కడ నిచ్చిన నీటిలో నిల్చొని విజ్ఞప్తి చేశారు. ఈ భూములు ముంపు బారిన పడకుండా నివాస యోగ్యం కావాలంటే ఎకరానికి 40 నుండి 50లక్షల రూపాయలు వెచ్చించి మెరక చేయాల్సి ఉంటుందని, అయితే ఆ విధంగా మెరక చేస్తే ఈ మాదిరిగా వర్షాలు పడిన సమయంలో సమీపంలోని రెండు మూడు గ్రామాలు ముంపునకు గురి అవుతాయని ఓ రైతు పేర్కొన్నారు. ఇటువంటి ఆవ భూములను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇచ్చి చంపవద్దని అయన విజ్ఞప్తి చేస్తూ తక్షణం ప్రభుత్వం ఈ ప్రతిపాదన విరమించుకోవాలని అయన కోరారు.