Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తరువాతే మందు తయారు చేసి పంపిణీ చేస్తానని ఆనందయ్య చెబుతున్నారు. రహస్య ప్రదేశంలో కరోనా మందు తయారు చేస్తున్నారన్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమన్నారు. గతంలో తాను మందు తయారు చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. శుక్రవారం స్వగ్రామానికి వచ్చిన ఆనందయ్యను మళ్లీ శనివారం వేకువ జామున పోలీసులు తీసుకువెళ్లారు. కృష్ణపట్నం నుండి అనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. శనివారం అందే నివేదికలను మరో అధ్యయన కమిటీ పరిశీలన చేస్తుందని చెప్పారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఆర్ఎఎస్ అధ్యయన నివేదిక కూడా అందనుందని తెలిపారు. ఆనందయ్య మందుపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన నేపథ్యంలో వాటిపై సోమవారం విచారణ జరగనున్నదన్నారు. నివేదికలతో పాటు కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఆనందయ్య మందుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై జరిపిన సమీక్షలో ఆనందయ్య మందుల పంపిణీనా చర్చించారన్నారు.
ఇప్పటి వరకూ ఆనందయ్య మందుపై వచ్చిన నివేదికలు అన్ని సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆనందయ్య మందు తీసుకున్న వారిలో ఎవరూ మృతి చెందలేదని చెప్పారు. ఆ మందు తీసుకున్న వారికి ఫోన్ చేసి విచారణ చేయగా చాలా మంది సానుకూలంగా చెప్పారన్నారు. ఆనందయ్య మందుపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాలేదని చెప్పారు. ఒక వేళ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లయితే అది అధికారికంగా చేపట్టింది కాదని అన్నారు. ఈ మందు పంపిణీకి సంబంధించి ఆనందయ్య ముందుగా ఆయుర్వేద విభాగం గుర్తింపునకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.