(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జనాభా నియంత్రణకు బాబా రామ్దేవ్ చెప్పిన చిట్కాను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బలపరిచారు. జనాభా పెరుగుదల ప్రమాదం గురించి మాట్లాడినందుకు రామ్దేవ్కు గిరిరాజ్ ధన్యవాదాలు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా నియంత్రణకు చట్టాలు రావాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
వచ్చే 50 ఏళ్లలో దేశ జనాభా 150 కోట్లకు మించరాదనీ, ఇద్దరు మించి పిల్లలు పుట్టినపుడు, మూడవ సంతానానికీ, ఆపై సంతానానీకీ వోటు హక్కు తీసివేస్తూ చట్టం చేసినపుడే ఇది సాధ్యపడుతుందనీ బాబా రామ్దేవ్ అన్నారు. అలాంటి పిల్లలకు ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ సర్వీసులో చేరే హక్కు కూడా నిరాకరించాలని ఆయన అన్నారు. దేశమంతటా గోవధను పూర్తిగా నిషేధించాలని కూడా ఆయన కోరారు.
దీనికి మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, అలా చేస్తే తన తల్లిదండ్రులకు మూడవ సంతానమైన నరేంద్ర మోదీ మొదట వోటు హక్కు కోల్పోతారని వ్యాఖ్యానించారు. అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండే బీహార్, బెగుసరాయ్ ఎంపి గిరిరాజ్ సింగ్ రంగంలోకి దిగారు.