2014 నుంచి 2019 దాకా ఏపీ పాలిటిక్స్లో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులు పలువురు వార్తల్లో కెక్కుతున్నారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు కేబినెట్ మంత్రుల హోదాలో ఏపీ పాలిటిక్స్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వీరంతా 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే తలో రకంగా దూరమయ్యారు. కొందరు ఆయన దగ్గరుంటూనే వివాదాస్పదులుగా వార్తలకెక్కి పరోక్షంగా పార్టీ పరువు తీస్తున్నట్లు కనిపిస్తోంది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అయిదేళ్ళ పాటు ఏపీని తనదైన శైలిలో పరిపాలించారు. 2019లో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్ర పక్షాలు బీజేపీ, జనసేన దూరం కాగా… వైసీపీ దూకుడుకు ఎదురు నిల్వలేకపోయారు చంద్రబాబు. 2019లో తెలుగు దేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితం కాగా.. అప్పటి దాకా బలంగా కనిపించిన టీడీపీ ఒక్కసారిగా బలహీన పార్టీగా నిలిచింది. ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.టీడీపీ తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో నలుగురు వైసిపికి జై కొట్టారు.ఇప్పుడు చంద్రబాబు హయాంలో మంత్రులుగా చేసిన వారి విషయాలు ముచ్చటించుకుందాం.
మాజీ మంత్రుల కథా కమామిషు
చంద్రబాబు మంత్రివర్గంలో పని చేసిన మాజీ మంత్రులు శిద్దా రాఘవ రావు, రావెల కిశోర్ బాబు, ఆదినారాయణ రెడ్డి.. పార్టీని వీడారు. వీరిలో శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరిపోయారు.ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా రాజకీయాల్లో ప్రవేశించిన శిద్ధా రాఘవరావు 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ చంద్రబాబు ఆయనపై విశ్వాసంతో మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితేనేం.. పార్టీ 2019లో ఓడిపోగానే ఆయన పార్టీ మారిపోయారు. అప్పటి దాకా రాజకీయ ప్రత్యర్థిగా భావించిన వైసీపీలో చేరిపోయారు. రావెల కిశోర్ బాబుది దాదాపు ఇదే పరిస్థితి. వివిధ ప్రభుత్వ విభాగాలలో అధికారిగా పని చేసిన రావెల కిశోర్ బాబు 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక కాగా.. అడ్మినిస్ట్రేటర్గా ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మంత్రి పదవినిచ్చారు.మధ్యలో మంత్రిపదవి తీసేశారు.దీంతో రావెల జనసేన వైపు వెళ్లారు.చివరకు బిజెపిలో తేలారు.ఇక కడప జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల్లో తరచూ వినిపించే పేరు ఆదినారాయణ రెడ్డి. చిరకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆదినారాయణ రెడ్డి.. ఆ తర్వాత జగన్ నేతృత్వాన్ని మెచ్చి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ.. ఆ తర్వాత చంద్రబాబు విసిరిన ఆకర్ష్లో భాగంగా ఆయన టీడీపీలో చేరారు. ఏకంగా మంత్రిపదవిని చేపట్టారు. అయితే అదెంతో కాలం నిలవలేదు. అధికారాంతమున ఆదినారాయణ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
క్రిమినల్ కేసుల్లో నలుగురు మాజీలు
చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన నలుగురు మాజీ మంత్రులు క్రిమినల్ కేసుల పాలయ్యారు. ముగ్గురు అరెస్టయి వార్తలకెక్కారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ చీఫ్ గా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు చేయడం జరిగింది. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో జరిగిన ఒక హత్య కేసులో జైలుపాలయ్యారు.మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఈఎస్ఐ స్కాములో ఇరుక్కున్నప్పటికీ అరెస్టు మాత్రం కాలేదు.తాజాగా భూదందా కిడ్నాప్ కేసులో మరో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే
ఇంటికి పరిమితమైన ఇద్దరు మాజీలు!
చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కర్నూలు జిల్లా సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి , మరో సీనియర్ నేత.. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సమకాలికుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కూడా క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగారు. అనారోగ్యం కారణంగా వారు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు సమాచారం..
వీరంతా ఎక్కడండీ ‘బాబూ’!
ఇదంతా ఒకెత్తైతే.. చంద్రబాబు మంత్రివర్గంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మరికొందరు రాజకీయంగా అదృశ్యమవడం మరింత చర్చనీయాంశమైంది. ఈ కోవలో గంటా శ్రీనివాస్ రావు, పి.నారాయణ వస్తారు. వీరిలో గంటా అయితే వైసీపీలోగానీ.. బీజేపీలోగానీ చేరతారంటూ గత ఏడాది కాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. అడపాదడపా పబ్లిగ్గా దర్శనమిస్తున్న గంటా శ్రీనివాస్ రావు.. అంతరంగం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పార్టీ మారతారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది తేలడం లేదు. కానీ.. టీడీపీలో యాక్టివ్గా లేరన్నది మాత్రం క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతోంది. మరో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ కూడా 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత క్రియాశీలకంగా లేరు. ఆయన గంటా శ్రీనివాస్ రావుకు దగ్గరి బంధువు అన్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే పరిటాల సునీత, సుజయ రంగారావు, కాల్వ శ్రీనివాసులు ,పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, కిడారు శ్రవణ్ లాంటి చంద్రబాబు మంత్రి వర్గ సహచరులు కూడా ప్రస్తుతం క్రియాశీలకంగా కనిపించడం లేదు.