చాలాకాలంగా టిడిపిలో తనకు తగిన ప్రాధాన్యం లభించలేదని ఒకింత ఆవేదనతో ఉన్న విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధకు తీపి కబురు అందనున్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన మంగళగిరి వైసిపి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టడం కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా పంచుమర్తి అనూరాధకు మంగళగిరి టీడీపీ ఇన్చార్జి పోస్ట్ ఇవ్వబోతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.తద్వారా పంచుమర్తి అనూరాధ అసంతృప్తిని కూడా పోగొట్టవచ్చునని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారట.నిజానికి మంగళగిరి బీసీల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గం.ప్రత్యేకించి చేనేతల ఖిల్లా! పద్మశాలీలు ఇక్కడ అధికం!ఇక్కడ నుంచి గతంలో పద్మశాలీ వర్గానికే చెందిన కాండ్రు కమల మునిసిపల్ చైర్మన్ అవ్వడంతో పాటు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.అలాగే ఇక్కడ నుండి గతంలో శాసనసభ్యులుగా విజయం సాధించిన మురుగుడు హనుమంతరావు, గోలి వీరాంజనేయులు కూడా ఇదే సామాజిక వర్గీయులు.మంగళగిరి నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది పద్మశాలీలు.దీంతో అన్ని పార్టీలు కూడా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి.మొన్నటి ఎన్నికల్లోనే చంద్రబాబు మంగళగిరిలో ప్రయోగం చేసి తన కుమారుడు లోకేష్ను నిలబెట్టారు.అయితే లోకేష్ ఓడిపోయారు.
వైసిపి గాలికన్నా చేనేత వర్గీయుల ఆగ్రహమే లోకేష్ పరాజయానికి కారణం అంటారు.లోకేష్ గనుక ఇక్కడ గెలిస్తే ఇక పాతుకు పోతారని తమ సామాజిక వర్గానికి ఇక అవకాశం రాదన్న ముందుచూపుతో చేనేతలు చినబాబును ఇంటి దారిపట్టించారన్నది ఒక విశ్లేషణ. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన చంద్రబాబు మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేకు బీసీ కార్డుతో మంగళం పాడాలని నిర్ణయానికొచ్చారని టిడిపి వర్గాలు తెలిపాయి.మరోవైపు పంచుమర్తి అనురాధ పార్టీని ఎంతగా భుజాలపై వేసుకొని మోస్తున్నప్పటికీ ఆమెకు ఇప్పటి వరకు సరైన అవకాశం రాలేదు.ఇటీవల తెలుగుదేశం పార్టీలో అనేక కీలక పదవులు భర్తీ చేసినప్పటికి అనూరాధకు బెర్త్ దొరకలేదు.దీంతో ఆమె ఆవేదనతో ఉన్నారు అదీగాక అనూరాధకికూడా ఎప్పటి నుండో మంగళగిరి సీటుపై ఆశ ఉంది.ఈ లెక్కలన్నిటిని వేసుకున్న చంద్రబాబు ఈరోజో రేపో అనురాధను మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా నియమించబోతున్నారని ఉన్నతస్థాయి టిడిపి వర్గాలు తెలిపాయి.