విశాఖపట్నాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంటరాని పట్టణంగా చూస్తున్నారని పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో టిడిపిని అంతో ఇంతో ఆదరించింది విశాఖ పట్టణమేనని వారు గుర్తు చేస్తున్నారు.విశాఖపట్నం పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలు టిడిపికి దక్కడ౦ ఇక్కడ గమనార్హం.చంద్రబాబు కరోనా సమయంలోనూ అప్పుడప్పుడూ విజయవాడ వచ్చి వెళుతున్నారు. కానీ అదే సమయంలో ఆయన విశాఖ రావడం లేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ లో చర్చ జరుగుతోంది.చంద్రబాబు విశాఖకు వచ్చి ఏడాది దాటుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి విశాఖ వచ్చి రివ్యూ చేశారు.ఆ తరువాత నుండి చంద్రబాబు విశాఖకు దూరంగా ఉండిపోయారు.దీనిపై పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడే అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ కే పరిమితమయితే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని అయన్న సూటిగానే ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా తాళం వేస్తే ఎలా అని దాదాపుగా నిలదీసినంత పని చేశారంటున్నారు.అయ్యన్న అసలు కోపానికి కారణం చంద్రబాబు విశాఖను విస్మరిస్తున్నాడనేనన్నది పార్టీ నేతల అభిప్రాయంగా విన్పిస్తోంది.లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించినా చంద్రబాబు విశాఖకు రాకపోవడాన్ని అక్కడి నేతలు తప్పుపడుతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థించినా విశాఖకు వచ్చేందుకు చంద్రబాబుకు మనసొప్పడం లేదంటున్నారు.
పార్టీ క్యాడర్ లో భరోసా నింపాలంటే విశాఖకు రావాలి కదా? అని ఉత్తరాంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడం లేదని, కేవలం అమరావతికి మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నారని, ఏ జిల్లాకు చంద్రబాబు వెళ్లడం లేదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నప్పటికీ విశాఖకు రాకపోవడాన్ని అక్కడి పార్టీ నేతలు మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారు.వైసిపి ఒకవైపు మూడు రాజధానులతో విశాఖపట్నంలో జెండా పాతడానికి పునాదులు వేసుకుంటున్న సమయంలో చంద్రబాబు తమ పార్టీని నిర్వీర్యం చేయటం తగదంటున్నారు.పార్టీ కేడర్ కనుక నిరాశ నిస్పృహలకి గురైతే విశాఖపట్నంలో సైకిల్ తొక్కే వాడే ఉండటమే టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు.