Babu Mohan: కమెడియన్ బాబు మోహన్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు అంటూ ఎవరూ ఉండరు. హావభావాలతో డైలాగులతో, చక్కటి కామెడీ టైమింగ్తో అతను సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. మామగారు సినిమాలో అతని కామెడీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అయితే మూవీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే అదే సమయంలో తనపై ఒక హత్యాయత్నం జరిగినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలేం జరిగింది
బాబు మోహన్ మాట్లాడుతూ.. “వన్స్మోర్” మూవీలో నేను నటించాను. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనికెళ్ల భరణి పాన్ తింటూ కనిపించారు. ఆయన తినడమే కాదు నన్ను కూడా తినమన్నారు. ఒకసారి చూడమన్నారు. ఆయన చెప్పే సరికి సర్లే తిందామని, దానిని నోట్లో పెట్టుకున్నాను. కానీ ఆ రుచి నచ్చకపోవడంతో వెంటనే ఛీచీ అంటూ ఊసేశాను. అదేంటో గానీ విచిత్రంగా నాకు పాన్ తినడం అలవాటైపోయింది. దాంతో ప్రతిరోజూ సంగారెడ్డిలోని ఓ పాన్ షాప్లో పాన్ను కట్టించుకుని బాగా తినేవాడిని. అయితే ఆ డబ్బాలో నేను డైలీ పాన్ కొనుగోలు చేస్తున్నట్లు ఎవరో తెలియని వ్యక్తులు గ్రహించారు.”
విషం కలిపి చంపాలని చూశారు: బాబు మోహన్
బాబు మోహన్ కంటిన్యూ చేస్తూ.. “ఒకరోజు నేను రోజులాగే పాన్ కట్టించుకుని కారులో పెట్టుకుని బయల్దేరాను. అలా కొంతదూరం వెళ్ళాక తాపీగా పాన్ తిందామని దాన్ని చేతిలోకి తీసుకున్నా.. సరిగ్గా అదే టైమ్లో ఒక ఆడ మనిషి నాకు కాల్ చేసింది. ఆమె కంగారు కంగారుగా మాట్లాడుతూ.. ‘సర్, ఆ పాన్ తినొద్దు ఎందుకంటే, అందులో విషం కలిపారు’ అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా నేను కంగు తిన్నాను. ఆమె ఫోన్ చేయడం కొంచెం ఆలస్యమైనా నేను ఆ పాన్ తినేవాడిని. అదృష్టం కొద్దీ ఆమె సమయానికి ఫోన్ చేసింది. నేను వెంటనే ఆ పాన్ను పక్కన పడేశాను.” అని సంచలన విషయాలు బయట పెట్టారు.
విషం కలిపిందెవరు?
మొదటిగా విషయం కలిపారని చెప్పిన మహిళ మళ్లీ తనకు కాసేపటి తరువాత ఆమె కాల్ చేసిందని బాబు మోహన్ అన్నారు. ఆమె ఎవరో కాదని… తనకు పాన్ కట్టించిన షాప్ అతను భార్యనేనని అప్పుడు తనకి తెలిసి వచ్చిందని అన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాగా బెదిరించడంతో చేసేది లేక తానే పాన్లో విషం కలిపానని ఆమె చెప్పిందని బాబు మోహన్ అన్నారు. అప్పటికిగానీ తనకు రాజకీయాలు అంటే ఎంత దారుణంగా ఉంటాయో తెలీలేదన్నారు.