రాజకీయవేత్తలకు – వ్యాపారవేత్తలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అన్నది అనఫిషియల్ వాస్తవం. ఎంత కాదన్నా ఆపత్కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.
అదే పరిస్థితి తారుమారు అయి ఒకరికి కష్టం వచ్చిన పిమ్మట మరొకరు తమ స్వార్థం చూసుకునే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడే పదవుల కోసం పైరవీలు చేస్తారు. ఆ తర్వాత వారి సొంత వ్యాపారాలే వారికి ముఖ్యం. ఇలా తెలుగుదేశం పార్టీని వదిలి చాలామంది వెళ్లిపోయారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తరువాత ఆ పార్టీ వైపు తిరిగి చూసే వారే లేరు. అయితే అందరూ వెళ్లి పోవడం ఒక ఎత్తు కంభంపాటి రామ్మోహన్ రావు వెళ్లిపోవడం మరొక ఎత్తు. ఈ సమయంలో అధినేత చంద్రబాబుకు అండగా నిలవాల్సిన ముఖ్యనేత రామ్మోహన్ రావు ఇప్పుడు ఇలా ఇలా ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అసలు తెలుగుదేశం పార్టీలోనే కంభంపాటి రామ్మోహన్ రావు ఒక నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ హయాం లోనే అతనికి మంచి ప్రాముఖ్యత దక్కింది. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపికయ్యాడు. చంద్రబాబు కూడా తన హయాంలో అతనికి ఏమీ కాదు అనకుండా ఇచ్చేవారు. అలాగే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక ఢిల్లీలో బాబు అతనిని లాబీయింగ్ కు ఉపయోగించుకున్నాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చేవి. ఇక ప్రభుత్వం మారడంతో రామ్మోహన్ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.
ఇటీవల రాజధాని భూముల కొనుగోలులో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినప్పుడు మాత్రం ఆయన వచ్చి స్పందించి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీకి అందుబాటులో లేరు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా బయటకి రావడంతో పార్టీ నాయకత్వంపై అనుకున్న అసంతృప్తి బయటపడింది. ఇలా అయనకు పార్టీ పై లోపించిన నమ్మకం కారణంగానే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. అంతేకాకుండా సుజనా చౌదరికి రెండవసారి రాజ్యసభ పదవి ఇచ్చిన సమయంలో కంభంపాటి రాజ్యసభ పదవిని ఆశించారు.
అయితే అతనికి ఆ పదవి దక్కకపోవడంతో ఇలా రివర్స్ అయ్యాడు అని అంటుంటారు. అలాగే సుజనా చౌదరి కి కంభంపాటి కి విభేదాలు తలెత్తినపుడు బాబు సుజనా వైపు నిలబడ్డారట. మరి ఇప్పుడు నేను బాబు వైపు ఎందుకు నిలబడాలి…? అని తన స్వార్థం చూసుకుంటున్నట్లు రామ్మోహన్ రావు ప్రవర్తిస్తున్నాడని…. టిడిపి వర్గాల్లో మాట. మరి బాబు నిజంగా ఏకాకి అయిపోయే రోజులు దగ్గర పడుతున్నాయా?