అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెయిల్పై విడుదల అయ్యారు. వెంకటాపురం ఎంపిడిఒ సరళ ఫిర్యాదుపై కోటంరెడ్డిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం మొబైల్ అండ్ స్పెషల్ జ్యూడిషియల్ కోర్టులో పోలీసులు హజరుపర్చారు. కోటంరెడ్డికి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడంతో పోలీసులు విడుదల చేశారు. అనంతరం ఆయన నెల్లూరు రూరల్ వైసిపి కార్యాలయానికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని తెలిపారు. తనపై కేసు నమోదులో కుట్ర కోణం ఉందనీ, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పి పనితీరుపైనా అనుమానం వ్యక్తం చేశారు.తనకూ ఎస్పికీ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనీ, ఇటీవలే జిల్లా ఎస్పి పనితీరుపై కలెక్టర్కూ ఫిర్యాదు చేశానని చెప్పారు. టిడిపి నేత, మాజీ మంత్రి నారాయణతో ఎస్పి సన్నిహితంగా ఉంటారని కూడా ఆరోపించారు.
టిడిపి హయాంలో ఒక మహిళా అధికారిపై దౌర్జన్యం జరిగిన ఘటనపై ఆ అధికారి, ఎమ్మెల్యేకి మధ్య చంద్రబాబు రాజీ చేసినట్లు కాకుండా తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చట్టం ముందు అందరూ సమానమేననీ, నిబంధనల ప్రకారం నడుచుకోవాలనీ పోలీసులను ఆదేశించారని అన్నారు. తమ నాయకుడి నిర్ణయాలను గౌరవిస్తామన్నారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సిఎం చెబితే ఎస్పి వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. అర్థరాత్రి సమయంలో తన ఇంటిపై, శ్రీకాంత్ రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇబ్బందులు పెట్టారని కోటంరెడ్డి అన్నారు. తనపై కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టించిన వారిపైనా చర్యలు తీసుకోవాలనీ కోటంరెడ్డి కోరారు. ఎంపిడిఒ ఇచ్చిన ఫిర్యాదులో నిజాలు ఉన్నాయని నిగ్గు తేలితే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జగన్మోహనరెడ్డిని కోరుతున్నానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగ విచారణకు సిద్ధమని కోటంరెడ్డి అన్నారు. తనపై ఆరోపణలు నిజమని తేలితే ఎంపిడిఒ తల్లి కాళ్లు పట్టుకొని క్షమాపణ చెబుతానని కోటంరెడ్డి అన్నారు.