బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరు వినని వారుండరు.గృహోపకరణాల నుంచి వాహనాల వరకు దేనికైనా ఈ సంస్థ ఫైనాన్స్ చేస్తుంది.రుణ మంజూరు విధానం చాలా సరళతరంగా ఉంటుంది కానీ ఆ తర్వాత రుణాల వసూలు విషయంలో మాత్రం ఈ సంస్థ అతి కఠినంగా వ్యవహరిస్తోంది.వడ్డీలు కూడా వాయింపు రీతిలో ఉంటాయి.
బజాజ్ ఫైనాన్స్ సంస్థ పై ఈ విషయాల్లో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మీడియాలో కూడా ప్రత్యేక కథనాలు రావడం జరిగింది.విషయం అటు తిరిగి ఇటు తిరిగి రిజర్వు బ్యాంకు దాకా వెళ్లడంతో ఆర్బీఐ స్పందించింది.దీంతో ఫైనాన్స్ సంస్థ బజాజ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది.ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జరిమానా విధించింది.కాగా కస్టమర్ల నుంచి రుణాలు రికవరీ చేయడంలో బజాబ్ ఫైనాన్స్ అనుసరిస్తున్న పద్దతులే ఇందుకు కారణమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది . కస్టమర్ల నుంచి రుణ రికవరీలో బజాజ్ ఫైనాన్స్ పద్ధతి బాగోలేదని చాలా ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రూల్స్ అతిక్రమించినందుకు భారీ జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై రూ 2.5 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ తన ఔట్ సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మేనేజింగ్ రిస్క్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ను అతిక్రమించడంతో ఆర్బీఐ సీరియస్ అయింది.
రిజర్వ్ బ్యాంకు నిబంధనలను బేఖాతరు!
ఆర్బీఐ నిర్దేశించిన రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం కస్టమర్ల నుంచి బజాజ్ ఫైనాన్స్ రుణాలు రికవరీ చేయడం లేదు.ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ నిబంధనలు కూడా అతిక్రమించిందని ఆర్బీఐ తెలిపింది.బజాజ్ ఫైనాన్స్ నిబంధనలను అతిక్రమించడంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 58 జీ, 58 బీలో ఉన్న పలు సబ్సెక్షన్ల కింద బజాజ్ ఫైనాన్స్పై జరిమానా విధించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణ రికవరీలో భాగంగా రికవరీ ఏజెంట్లు వినియోగదారులను వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆర్బీఐకి ఫిర్యాదులు అందాయ్. వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో బజాజ్ ఫైనాన్స్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొని జరిమానా విధించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణ రికవరీపై కంపెనీపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని ఈ సందర్భంలో తెలిపింది. ఇలాంటి చర్యలు మరోసారి పునారవృతం అయితే…కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.