నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. బాలయ్య నటించిన సినిమాలు గతేడాది మూడు విడుదలవగా మూడూ కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు డిజాస్టర్లుగా మినిమమ్ కలెక్షన్స్ తెచ్చుకోవడంలో విఫలమయ్యాయి.
అందుకే బాలయ్యకు హిట్ కొట్టడం అనేది కచ్చితం. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో బిబి3 ట్యాగ్ తో ఈ సినిమా పట్టాలెక్కింది. ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరిగాక లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మొత్తం నిలిచిపోయింది.
ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ నుండి సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. వచ్చే మార్చ్ కల్లా షూటింగ్ ను పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరులో సినిమాను మన ముందుకు తీసుకొస్తారు. అయితే బోయపాటి శ్రీను సినిమా తర్వాత బాలయ్య చేయాల్సిన సినిమా ఏంటి అనేది అభిమానులకు సస్పెన్స్ ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య, వెటరన్ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడట. వీరిద్దరూ కలిసి గతంలో ఎన్నో పవర్ఫుల్ హిట్స్ ఇచ్చారు. అయితే బి. గోపాల్ క్రమంగా ఫామ్ కోల్పోతూ వచ్చాడు. దర్శకత్వానికి కూడా దూరమయ్యాడు. గత కొంత కాలం నుండి బాలయ్య, బి. గోపాల్ దర్సకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం కథను సిద్ధం చేసాడట. బాలయ్యకు కూడా ఈ కథ బాగా నచ్చిందని కచ్చితంగా సినిమా చేస్తానని మాట ఇచ్చాడని సోషల్ మీడియాలో ఒక వర్గం కోడై కూస్తోంది. బోయపాటితో సినిమా విడుదలయ్యాక కచ్చితంగా ఇదే సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఫామ్ లో లేని దర్శకుడితో సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.