Balineni Srinivasa Reddy: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల మూడు నెలలు అయ్యింది. మరో మూడు నెలల్లో మంత్రివర్గంలో ప్రక్షాళన జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మంత్రుల ప్రమాణ స్వీకారం రోజునే వైఎస్ జగన్ మంత్రుల పదవీ కాలాన్ని స్పష్టం చేశారు. దీంతో అప్పుడు మంత్రి పదవులు ఆశించిన వారు తరువాత అవకాశం లభిస్తుందని భావించారు. మంత్రివర్గ ప్రక్షాళన గడువు దగ్గర పడుతుండటంతో మంత్రులుగా ఉన్న వారిలో, మంత్రిపదవులు ఆశిస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. మంత్రివర్గంలో ఎందరు కొనసాగుతారు?. ఎవరు మాజీలు అవుతారు?. ఎవరికి అవకాశం లభిస్తుంది ? అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే క్రమంలో జగన్ మంత్రివర్గంలో 90 శాతం మందిని మార్పు చేస్తారని లేదు, 50 శాతం వరకూ మార్పులు చేర్పులు ఉండవచ్చనే వార్తలు షికారు చేస్తున్నాయి.
ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి దగ్గరి బంధువు కూడా అయిన ఓ మంత్రి పెద్ద బాంబ్ పేల్చారు. మంత్రి వర్గంలోకి నూరు శాతం కొత్త వారిని తీసుకోనున్నారని ఆ మంత్రి పేర్కొన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో ఇది జగన్మోహనరెడ్డి మనసులో మాట ఆయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి నుండి మంత్రులు మానసికంగా సిద్ధం అయ్యేందుకు ఈ లీక్ లు ఇచ్చారనే మాట కూడా వినబడుతోంది. పార్టీ విధాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని కూడా బాలినేని..సీఎం జగన్ కు చెప్పారట. వైసీపీలోని 151 మంది ఎమ్మెల్యేలలో ప్రస్తుతం 25 మంది మంత్రులు ఉన్నారు. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరుగనుండటంతో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రిపదవులను ఆశిస్తున్నారు.
సీనియర్ లతో పాటు పలువురు జూనియర్ లు కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణంలో ఉపయోగించుకుంటామని గతంలోనే జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 50 శాతం, 90 శాతం అంటూ వార్తలు రాగా బాలినేని వ్యాఖ్యలతో పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకునే వారిని రాబోయే ఎన్నికల వరకూ కొనసాగిస్తారా లేక చివరి సంవత్సరంలో పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తారా అనే దానిపై ఊహగానాలు సాగుతున్నాయి.
Read More:
3.Janasena – Tdp: టీడీపీ – జనసేన పొత్తు..? ఇదే సాక్షం..!!