Balineni: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పట్ల అసంతృప్తి గా ఉన్నారనీ, అందుకే రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో గురువారం సీఎం జగన్మోహనరెడ్డితో బాలినేని భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బాలినేని తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. జిల్లాకే చెందిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తొంది. తాను పార్టీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తన పై వివాదాలు సృష్టిస్తూ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని భావోద్వేగానికి గురై కంట తడి కూడా పెట్టారు.
తాజాగా బాలినేనికి సీఎం కార్యాలయం నుండి కబురు రావడంతో గురువారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి సీఎం జగన్ తో బాలినేని చర్చించేందుకు సమావేశమైనట్లు తెలుస్తొంది. మరో పక్క రీజనల్ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగాలని బాలినేనికి సీఎం జగన్ విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత బాలినేనిని కలిసిన మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు గతంలోనే సీఎం జగన్ తో చర్చించానన్నారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్నా ఇబ్బందుల పై కూడా సీఎం కి వివరించాననీ, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదని అన్నారు. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉందన్నారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా చర్చ జరగలేదని ఆయన చెప్పారు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానని తెలిపారు.
నియోజకవర్గం మీద దృష్టి పెట్టమని చెప్పారన్నారు. తాను ప్రతిపాదించిన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు బాలినేని. తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబందించి రూ.200 కోట్లు శాంక్షన్ చేయాల్సి ఉండగా, ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేశారనీ, ఇంకా రూ.170 కోట్లు విడుదల చేయాల్సి ఉందనీ, ఆ విషయం ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. త్వరలో ఒంగోలులో పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ కి సీఎం వస్తారని బాలినేని తెలిపారు. తనకు అలక అంటూ ఏమి లేదని చెప్పారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారతారు అంటూ వస్తున్న వార్తలపై మీడియా ప్రశ్నించగా, ఆ అవసరం ఏముంది, ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయని బాలినేని తెలిపారు.