తెలంగాణలో రాజకీయ వాతావరణం మరో సారి వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ సోమవారం బైంసా నుండి పాదయాత్ర ప్రారంభించనుండగా, శాంతి భద్రతల దృష్ట్యా పాదయాత్రకు అనుమతిని పోలీసులు కాన్సిల్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన రేపటి పాదయాత్రకు నిర్మల్ వెళుతుండగా, కోరుట్ల సమీపంలో వెంకటాపూర్ వద్ద బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ముందుగా పాదయాత్రకు అనుమతి ఇచ్చి చివరి నిమిషంలో ఎందుకు రద్దు చేశారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్ కు తరలించారు. బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తను పాదయాత్ర నిర్వహిస్తుంటే కేసిఆర్ లో వణుకు పుడుతోందంటూ బండి సంజయ్ విమర్శించారు. కేసిఆర్ సర్కార్ ను తీవ్రంగా విమర్శించారు.
ఈ ఘటనపై బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేక ఇలా ప్రభుత్వం బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రజల కోసం చేస్తున్నారని అన్నారు.
TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?