తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా పామ్నూరు వద్ద ఆయన చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు నినాదాలు, నిరసనల మధ్య బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద నిన్న బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టగా నిరసన కారులపై పోలీసులు తొలుత నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత సెక్షన్లను మార్పు చేశారు. బీజేపీ నేతలపై వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని నిరస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూరు లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ దీక్ష చేపట్టగా పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు,. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు బీజేపీ శ్రేణులను పక్కకు తప్పించి వాహనంలో తరలించారు. అనంతరం కరీంనగర్ లో బండి సంజయ్ ను వదిలిపెట్టారు.
మరో పక్క బండి సంజయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా సంస్థలు నివేదిక అందించాయి. దీంతో బండి సంజయ్ తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, కేంద్ర పెద్దలు ఫోన్లో మాట్లాడారు. బండి సంజయ్ కు పోలీసులు భద్రత పెంచేందుకు సిద్దమవ్వగా బండి సంజయ్ స్థానిక పోలీసు భద్రతను తిరస్కరించారు. తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం లేదని కేంద్ర పోలీసు బలగాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియా సమావేశంలో కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్కడైతే తన పాదయాత్ర నిలుపుదల చేశారో అక్కడి నుండి మళ్లీ మెదలు పెడతానని పేర్కొన్నారు.
ఇదే విధంగా వివిధ ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నానన్నారు. సీఎం కేసిఆర్ అభద్రతా భావంతో ఉన్నారని అందుకే బీజేపి నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారన్నారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వినాాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా త్వరలోనే కేసిఆర్ కుటుంబం, ప్రజా వ్యతిరేక పాలన నుండి ప్రజలు విముక్తి కలుగుతుందని అన్నారు.