(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ కి సంబంధించి మిత్రపక్షాలైన బిజెపి జనసేన పార్టీల వ్యవహారం, తీరుతెన్నులు ఆ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గందరగోళానికి గురి చేశాయి. చివరి వరకు రెండు మిత్రపక్షాలు విభిన్న ప్రకటనలు పోటీ విషయంలో వేర్వేరు అంశాలను ప్రస్తావించడం తో పాటు, నేతల భేటీ విషయంలోనూ విభిన్న ప్రకటనలు చేసి సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురయ్యారు. చివరకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి నేత లక్ష్మణులు స్వయంగా పవన్ దగ్గరకు వచ్చి మాట్లాడడం తో సమస్య పోయింది. చివరకు జనసేన పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు తెలిపింది. అయితే ఈ గజిబిజి గందరగోళం విభిన్న ప్రకటనలకు మధ్య ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన పొరపొచ్చాలు ప్రధాన కారణమని తెలుస్తోంది. బండి సంజయ్ తీరు, ఆయన ప్రవర్తన పట్ల, పార్టీల పోటి విషయంలోనూ ఆయన వ్యవహరించిన వైఖరి పట్ల పవన్ మనస్తాపం చెందే మంగళగిరి పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అప్పటికప్పుడు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
అసలు ఏమైంది అంటే?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే మిత్రపక్షమైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. వారి బేటీ సహృదయం గా సాగింది. తర్వాత జరిగిన మెదక్ జిల్లా దుబ్బాక ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ ప్రచారానికి రావాలని బండి సంజయ్ కోరారు. అయితే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పర్యటన బీజేపీ అధినాయకత్వం రద్దు చేయించింది. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి గెలుపు తర్వాత బండి సంజయ్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. తెలంగాణలో బిజెపి ఒంటరిగా వెళ్తే ప్రయోజనం ఉంటుందని ఆయన బలంగా భావించారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పారు. జనసేన ఉన్న బలం ఏమీ లేదని దీనివల్ల తెలంగాణలో బీజేపీకి నష్టమే తప్ప లాభం ఉండబోదని ఆయన వివరించారు. ఆయన ఓ నివేదిక ఇచ్చిన తర్వాతే తెలంగాణలో జనసేన తో పొత్తు ఉండదని ఒక ప్రకటన వచ్చింది. సరిగ్గా ఇదే విషయం పవన్ కు చికాకు తెప్పించింది. బీజేపీతో కేవలం ఆంధ్రా వారికి రాజకీయ పొత్తు ఉంటుందని బిజెపి పెద్దలు తనకు చెప్పలేదని మీరు తెలుగు రాష్ట్రాల్లో ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పిన విషయాన్ని జనసేన నాయకులు వద్ద ప్రస్తావించారు. మంగళగిరి సమావేశంలో ఉన్నప్పుడు మరోమారు బిజెపి జనసేన పార్టీ మధ్య ప్రకటనల విషయంలోనూ పొరపొచ్చాలు బయటకు వచ్చాయి. తెలంగాణ బీజేపీ నాయకులను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు విషయంలో కలుస్తామని జనసేన ప్రకటన వచ్చిన వెంటనే బిజెపి నాయకులు దీన్ని ఖండించారు. దీంతో బిజెపి రాష్ట్ర నాయకుల తీరు పై తీవ్ర ఆగ్రహంతో పవన్ మంగళగిరి సమావేశంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై ప్రకటన చేశారు.
అందుకే బండి సంజయ్ రాలేదా?
జనసేన పార్టీ విషయంలోనే కాదు.. ఆ పార్టీ హైదరాబాద్ లో ఎలాంటి ప్రభావం చూపబోదని దీనివల్ల బిజెపికి వచ్చే నష్టం తప్ప పవన్ వల్ల భారం తప్పదు అంటూ బండి సంజయ్ బిజెపి నాయకుల వద్ద చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ వరకు వెళ్లాయి. దీన్ని ఆయన బిజెపి పెద్దల వరకూ విషయాన్ని తీసుకెళ్లడంతో పాటు బండి సంజయ్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతోనే శుక్రవారం పవన్ తో మాట్లాడడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేత లక్ష్మణులు మాత్రమే వచ్చారు. బండి సంజయ్ తీరును పవన్ సైతం వారి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదే పరిస్థితి భవిష్యతు లో కొనసాగితే కష్టమని ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఒక సమన్వయ కమిటీని సైతం ఆయన వేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతోనే ఒక సమన్వయ కమిటీ వేస్తామని ప్రకటన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.