Bandi Sanjay: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శత్రువులు ఉండరని అంటుంటారు. కొందరు విమర్శలు చేసినప్పటికీ, అంశాల వారీగా ఒక్కో సారి ఒకే లైన్ మీదకు వస్తుంటారు. అలాంటి లైన్ తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోందని పలువురు అంటున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని పేర్కొన్న ఆయన ఆ విధంగానే మద్దతు ఇచ్చారు.
మద్దతు ఇస్తూనే మెలిక పెట్టేశారుగా
లాక్ డౌన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ సర్కారుకు పలు షరతులు విధించారు. ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని… లాక్ డౌన్ సమయంలో వైద్య సేవలు, పేషేంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా, టెస్టులు, ట్రీట్ మెంట్ ఆగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని నిరూపణ అయిందని… ఈ లాక్ డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రానికి అవసరమున్నంత ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ఇంజెక్షన్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించిందని… ఆక్సిజన్, రెమ్ డిసీవర్ ఇంజెక్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సూచనలు… సలహాలు…
ప్రజల ప్రాణాలను కాపాడాలనే సోయి కేసీఆర్ కు ఉంటు తెలంగాణలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల బకాయిలను వెంటనే చెల్లించి ఆ తర్వాత కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని బండి సంజయ్ సూచించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 440 టన్నుల ఆక్సిజన్ను కేటాయించిందని, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చిందని ఆయన అన్నారు. అయినా వాటిని ఎందుకు ఏర్పాటు చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం 1,250 వెంటిలేటర్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వినియోగించట్లేదని ప్రశ్నించారు బండి సంజయ్. కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క ఐసోలేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించలేదని అన్నారు. కేసీఆర్ కు కూడా కరోనా వస్తే ప్రజల ఇబ్బందులు ఏంటో అర్థం అవుతాయి అనుకున్నాం..కానీ ప్రజలు కరోన తో ఇబ్బందులు పడుతుంటే రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.