Bangalore: వాతావరణంలోని మార్పుల వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, వాతావరణ సమస్యలు, వింత రోగాలు వస్తున్నాయి. వీటికి కారణం ఏమిటో తెలిసినా నిర్ములించలేని గడ్డు పరిస్థితిలో ఉన్నాం. అటువంటి ప్రధాన సమస్యలలో కాలుష్యం ఒకటి. మన దేశంలో కాలుష్యం తారాస్థాయిలో పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా ఫలితం మాత్రం సూన్యం. మన దేశ రాజధాని ఢిల్లీ తో పాటుగా పెద్ద పెద్ద నగరాలలో రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదవుతుంది.
అయితే మన దేశంలో అధికంగా కాలుష్యం నమోదవుతున్న నగరాల జాబితాలో కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు టాప్లో ఉంది. ఇటీవల విడుదల అయిన సమాచారం ప్రకారం బెంగళూరు, దేశవ్యాప్తంగా అధికంగా కాలుష్యం నమోదవుతున్న నగరాలలో మూడవ స్థానంలో ఉందట. ముఖ్యంగా వాయు కాలుష్యం సంబంధిత సమస్యలు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో గత సంవత్సరం బెంగళూరులో దాదాపుగా 12వేల మంది మరణించినట్లు సమాచారం.
ఈ జాబితాలో బెంగళూరు మూడవ స్థానంలో ఉండగా దేశ రాజధాని అయిన ఢిల్లీ టాప్ పొజిషన్ లో ఉంది. గత ఏడాది ఢిల్లీ లో వాయు కాలుష్యం వలన మరణించిన వారి సంఖ్య 54వేలు. ఢిల్లీ తరువాత ఆ జాబితాలో రెండవ స్థానములో ఉన్నది ముంబై నగరం. వాయు కాలుష్యం వలన ముంబైలో గతేడాది మరణించిన వారి సంఖ్య 25వేలు. ఇక్కడ మరో ముఖ్యమయిన సమాచారం ఏమిటంటే గతేడాది ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం వలన సంభవించిన మరణాలలో కూడా ఢిల్లీనే టాప్ లో ఉంది. ఢిల్లీ తరువాతి స్థానాలలో మెక్సికో సిటీ, సావో పాలో, టోక్యో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం వలన మరణించిన వారి సంఖ్య మొత్తం లక్షా అరవై వేలు.