(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరం వెంబడి గంటకు 65 నుండి 70 కిలో మీటర్ల వేగంత ఈదురుగాలులు వీస్తున్నాయి. బలమైన ఈదురు గాలుల కారణంగా విశాఖ తెన్నీటి పార్క్ తీరానికి ఒ భారీ నౌక కొట్టుకువచ్చింది.
గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 80 మీటర్ల పొడవాటి బంగ్లాదేశ్కు చెందిన మర్చంట్ వెసల్ నౌక విశాఖ తీరం ఒడ్డునకు చేరుకుని పార్క్ సమీపంలోని రళ్లలో చిక్కుకున్నది. అర్థరాత్రి సమయంలో ఇసుక తిన్నెల మధ్య నౌక చిక్కుకోగా నౌక లోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ కోల్పోవడంతో సమస్య తలెత్తినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విశాఖ నేవీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు చెందిన భారీ నౌక విశాఖ తీరానికి కొట్టుకొచ్చినట్లు తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని వీక్షిస్తున్నారు.