భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 56 బీసీ ఉప కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేసి పాలకవర్గాలను నియమించిన సంగతి తెలిసిందే. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్గించడంతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ 50శాతం రిజర్వేషన్లు కల్పించారు.
ఈ నేపథ్యంలో 56 బీసీ ఉప కులాల కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం బీసీ సంక్రాంతి పేరుతో వేడుకను విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన సీఎం వైఎస్ జగన్ ముందుగా జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
56 కార్పోరేషన్ల చైర్మన్లు, ఒక్కో కార్పోరేషన్ లోని 13 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీసీల అభ్యున్నతికి గతంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రశంసించారు. రాజకీయ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి బిసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.