కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ నిరవధిక వాయిదా పడింది. మార్చి 29వ తేదీ నుంచి ఈ లీగ్ జరగాల్సి ఉన్నా.. అప్పుడే లాక్డౌన్ ఆరంభం కావడంతో ఐపీఎల్ను ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేశారు. కానీ అప్పటికీ దేశంలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. దీంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా ప్రేక్షకులు లేకుండానే స్టేడియాలలో మ్యాచ్లను నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ అందుకు సుముఖత ప్రదర్శించలేదు. ఇక ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది.
అయితే దేశంలో అక్టోబర్ వరకు కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న దృష్ట్యా బీసీసీఐ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిసింది. గతంలో రెండు మార్లు.. ఒకసారి యూఏఈలో, మరోసారి సౌతాఫ్రికాలో ఐపీఎల్ను నిర్వహించారు. అయితే ఈ సారి టోర్నీ కోసం శ్రీలంక, యూఏఈ దేశాలు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు దేశాల్లో ఐపీఎల్ను ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందనే విషయంపై బీసీసీఐ ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై బీసీసీఐ చాలా త్వరగా నిర్ణయం కూడా తీసుకోనున్నదట.
అయితే అక్టోబర్ నెలలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా.. దానిపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణపై జూలై నెలలో ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ బోర్డు ఈ విషయంపై ఇంకా చడీ చప్పుడు చేయడం లేదు. అయితే టీ20 వరల్డ్ కప్పై ఐసీసీ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాక.. బీసీసీఐ వెంటనే ఐపీఎల్పై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వరల్డ్కప్ జరగకపోతే శ్రీలంక లేదా యూఏఈలలో ఎక్కడో ఒక చోట ఐపీఎల్ను నిర్వహిస్తామంటూ.. బీసీసీఐ తక్షణమే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిసింది. అయితే వరల్డ్ కప్పై ఐసీసీ వెలువరించే ప్రకటనపైనే అటు బీసీసీఐతోపాటు ఇటు యావత్ క్రికెట్ అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఐసీసీ వరల్డ్ కప్పై ఏం నిర్ణయిస్తుందో చూడాలి..!