తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల కోసం గాలిస్తోంది.రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎంతగా దిగజారిందంటే సెప్టెంబర్ నెల లో పదవ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు జీతభత్యాల చెల్లింపు జరగనంత!
మరోవైపు ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల జోరు తగ్గించలేదు.ఏదో ఒక పథకం పేరుతో ప్రతి నెలా లబ్దిదారులకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేస్తూనే ఉన్నారు.కానీ కరోనా కారణంగా ఆదాయం తెచ్చిపెట్టే ప్రభుత్వ శాఖలన్నీ ఒట్టిపోయాయి.ఎప్పటికప్పుడు ప్రభుత్వాని కున్న వెసులుబాటును బట్టి రిజర్వ్ బ్యాంకు నుండి డబ్బు తెచ్చుకుని పబ్బం గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కన్ను టిటిడి నిధుల మీద పడిందట!మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వివిధ సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వైపు చూస్తుందట.
బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ శ్రీవారి సొమ్ము ప్రభుత్వ ఖజానాకు మళ్లించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గతంలో టీడీపీ హయాంలో ప్రైవేటు బ్యాంకులలో అధిక వడ్డీ వస్తుందని ,కాబట్టి ప్రైవేటు బ్యాంకుల్లో టిటిడి నిధులు జమచేయాలని అప్పటి పాలకవర్గం యోచన చేయగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుమారం రేపింది.దానితో ఎప్పటిమాదిరి గానే ప్రభుత్వరంగ బ్యాంకులలోనే టీటీడీ సొమ్ము ఉంచుతుంది. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే టిటిడికి వడ్డీ లభిస్తోంది.. అదే ప్రభుత్వ బాండ్ల ద్వారా అయితే 7 శాతం వరకు లభించే అవకాశం ఉందని టీటీడీకి ప్రభుత్వ పరంగా ప్రతిపాదన వెళ్లిందట . దీని టిటిడి పరిశీలిస్తోందని కూడా సమాచారం .
అసలు విషయం మాత్రం విశృంఖలంగా అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు కొత్త రుణాలు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో అధిక వడ్డీ పేరుతో టీటీడీ నిధులను ప్రభుత్వ ఖజానాకు మళ్లించేదే ఈ ఎత్తుగడ అని టిటిడి వర్గాలు చెబుతున్నాయి .పైగా ముఖ్యమంత్రి జగన్ కి బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా ఉండటం కూడా ఇక్కడ గమనార్హం.రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే మాత్రం టిటిడి నిధులను లాగేయటం గ్యారెంటీ అని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.మరి తిరుమలేశుని సొమ్ము ఏమవుద్దో చూడాలి!