చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడుదల రజిని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.తెలుగుదేశం పార్టీ నుండి చివరి నిమిషంలో వైసీపీలో చేరినప్పటికీ ఆమెకు జగన్ టికెట్ ఇచ్చారు.
వైసీపీ గాలిలో ఆమె కూడా గెలిచారు పైగా అప్పటి టిడిపి మంత్రి పత్తిపాటి పుల్లారావుని ఓడించి జెయింట్ కిల్లర్ అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. వైసీపీలో ఆమెకెంతో రాజకీయ భవిష్యత్తు ఉందని అందరూ భావిస్తున్నారు. కానీ రోజుకో వివాదంలో విడదల రజిని చిక్కుకుంటూ తన కెరీరును తానే నాశనం చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంతకు ముందు రజని పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు లేకపోవడం, నూతన 108 అంబులెన్సులు నియోజకవర్గానికి వచ్చినప్పుడు నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలేని ఫ్లెక్సీలు వెలియడం వివాదాస్పదం కావడం తెలిసిందే. తాజాగా విడదల రజిని పై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గ పరిధిలోని పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు రైతుల నుండి కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున పర్సంటేజీ వ్యవహారం జరిగిందని ఇందులో రజినిది కీలక పాత్ర అని పేట లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 6 కోట్ల రూపాయలు దండుకునే ఆ ప్లాన్ ను ను వైసీపీకే చెందిన రజిని బద్ద శత్రువైన ఒక కీలక ప్రజా ప్రతినిధి ఆఖరి నిమిషంలో నాశనం చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పేదలకు ఇచ్చేందుకు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో దాదాపు 120 ఎకరాల భూములను రైతులు నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. మార్కెట్ ధర కన్నా ప్రభుత్వ ధర అధికంగా ఉండడంతో రైతులు కూడా సంతోషంగానే ప్రభుత్వానికి భూములను అమ్మేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అమ్ముకున్న భూములకు రైతులకు ప్రభుత్వం నుండి పూర్తి పరిహారం లభించింది.
తదుపరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రజిని ఎమ్మెల్యే అయ్యాక ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములకు భూములకు మాత్రం స్థానిక వైసీపీ నేతలు తమకింత ఇవ్వాలని పర్సంటేజీని ఫిక్స్ చేశారు. ఆ విధంగా వారికి లభించే పర్సంటేజీ సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుందని లెక్క. అంతటితో ఆగకుండా స్థానిక వైసీపీ నేతలు తనకు పర్సంటేజీ ఇవ్వాల్సిన రైతుల నుండి ప్రామిసరీ నోట్లు చెక్కులు కూడా ముందే తీసేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ నగదు చెల్లింపులు జరుపుతోంది. ఇవాళో రేపో వైసీపీ నేతలకు వాళ్ల పర్సంటేజీ ముట్టే తరుణంలో రజనీతో వైరమున్న అదే ప్రాంతానికి చెందిన మరో ప్రజా ప్రతినిధికి విషయం అంతా తెలిసిపోయింది ఆయన ఆరా తీసి అంతా కరెక్టే అని నిర్ధారించుకున్నారు.
వెంటనే రైతులకు ఫోన్ చేసి డబ్బులు మీకు వస్తాయి.. ఎవరికి పైసా ఇవ్వదు అని సదరు ప్రజా ప్రతినిధి చెప్పేశారు. అవసరమైతే ఈ విషయాన్ని పోలీసుల దాకా తీసుకెళ్తానని కూడా ఆ ప్రజా ప్రతినిధి హెచ్చరించారు. దీంతో శాసనసభ్యురాలి వర్గీయులు తాము తీసుకున్న ప్రామిసరీ నోట్లను చెక్కులను రైతులకు ఇచ్చేశారని ,అంతా కాకుంటే కొంతయినా ఖర్చుల కింద ఇవ్వాలని బతిమాలుతున్నారని చిలకలూరిపేట కోడైకూస్తోంది. ఈ వ్యవహారమంతా రజనీ కనుసన్నలలోనే జరిగిందని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల చదును సందర్భంగా గ్రావెల్ ని కూడా రజనీ అనుచరులు అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం వైసిపి లో రజనికి బద్ద శత్రువులు ఉన్నారు. దొంగతనంగా పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదనుకునే పిల్లి మాదిరి రజిని వ్యవహరిస్తే రాజకీయంగా దెబ్బయిపోతారన్నది పరిశీలకుల విశ్లేషణ!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?