కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ప్రారంభమైన రైతాంగ నిరసనలు నేడు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల సంఘాలు దేశ వ్యాప్త బంద్కు పిలుపునివ్వగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుండే దుకాణాలు మూతపడ్డాయి. ఉదయం 11గంటల నుండి బంద్ ప్రారంభం అవుతుందని ముందుగా చెప్పినప్పటికీ ఉదయం నుండే దుకాణాలు మూతపడ్డాయి. డిపోల నుండి బస్సు సర్వీసులు బయటకు రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీలతో పాటు వివిధ రాజకీయ పక్షాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు భారత్ బంద్కు మద్దతు ప్రకటించాయి.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నేతలు నిరసన తెలియజేస్తున్నారు. బస్టాండ్ వద్ద సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ. మధు ఇతర నేతలు భైటాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విజయవాడలో బస్సులను నిలిపివేయనున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ల వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బంద్కు తెలిపాయి. హైదరాబాద్లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రహదారులపై పాత టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై భైటాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కూకట్పల్లిలో భారత్ బంద్ సందర్భంగా రహదారులను బారికేడ్లతో మూసివేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీని ప్రజలు నిలదీశారు. ఉదయం 11గంటల నుండి బంద్ అని ప్రకటించి ముందుగానే రహదారులను క్లోజ్ చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు రైతుల సమస్యలు గుర్తుకు వచ్చాయా అని బంద్ నిర్వహిస్తున్న నేతలను ప్రజలు ప్రశ్నించారు.