దంతెవాడ: సార్వత్రిక ఎన్నికల వేళ దంతెవాడలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దంతెవాడకు ప్రచారానికి వెళ్తున్న బిజెపి ఎమ్మెల్యే కాన్వాయ్ను మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు.
మావోయిస్టుల దాడిలో బిజెపి ఎమ్మెల్యే భీమా మాండవి సహా ఐదుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన దంతెవాడ సమీపంలోని నకులానర్ ప్రాంతంలో జరిగింది. పేలుడు ధాటికి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ఎగరిపడింది. మృతదేహాలు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి.
ఈ ఘటనలో కాన్వాయ్లో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
మండవి దంతెవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే. బస్తర్ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా దంతెవాడలో మాత్రమే బిజెపి గెలుపొందింది. మిగతా 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు.
ఛత్తీస్ ఘడ్లో మూడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, 23 తేదీల్లో పోలింగ్ జరగనుంది.