Bhogi: తెలుగు వారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి.. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలి ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు కూడా ఇదే.. ఆ రోజు వేకువ జాము కంటే ముందే భోగి మంటలను వేసుకుంటారు.. ఈ భోగి మంటలతోనే అసలైన సంక్రాంతి పండుగ మొదలవుతుంది.. భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఆరోగ్యకరమైన కారణం కూడా ఉంది. అయితే భోగి పండ్లను ముందుగా ఎవరు పిల్లల తల మీద పోయాలి.. ఏ సమయంలో పోయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భోగి పళ్ళను చిన్న పిల్లలందరికీ పోస్తారు. 12 సంవత్సరాల లోపు పిల్లల వరకు పోయవచ్చు. ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కచ్చితంగా పోస్తారు మన పెద్దలు.. భోగి పళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు సుమారు 6, 7 గంటల సమయంలో పోస్తారు. ముందుగా పీట వేసి దానిమీద తెల్లని వస్త్రం వేయాలి దానిపైన భోగి పళ్ళు పోసే పిల్లలను కూర్చోబెట్టాలి ఈ భోగి పళ్ళు తో పాటు నాణేలు, పువ్వుల రెక్కలు, చెరుకు గడలు అన్నిటినీ కలిపి ముందుగా పిల్లల తల్లి మూడు మార్లు దిష్టి తిప్పి పోయాలి. ఆ తర్వాత ముత్తైదువులందరూ కలిసి పోయాలి.
ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి.. నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలని పేరు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.