ఆళ్లగడ్డ, ఏప్రిల్ 11: ఆళ్లగడ్డలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసిపి నాయకుడు గంగుల విజయేందర్ రెడ్డి వర్గీయులు తమ వర్గానికి చెందిన ఇద్దరు యువకులను కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థి, మంత్రి భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిలు వారి వర్గీయులతో రోడ్డుపై భైటాయించి ఆందోళన చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే వైసిపి నేతలు ఆశాంతిని సృష్టిస్తున్నారని భూమా మౌలిక ఆరోపించారు. తమ అనుచరులను అప్పగించకపోతే గంగుల విజయేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై వాహనాలను నిలుపుదల చేసి భూమా వర్గీయులు ఆందోళన నిర్వహించారు.
తమ అనుచరులు రవి, నానిలను వైసిపి అభ్యర్ధే కిడ్నాప్ చేశారనీ, పోలీసులు కూడా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మౌలిక ఆరోపించారు. వైసిపి వారికి ఓట్లు రావని ఘర్షణలకు తేరతీస్తున్నారని మౌనిక అంటున్నారు. పోలీసులు స్పందించి తమ వారిని అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలనీ లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న భూమా వర్గీయులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.
ఈ ఘటనకు ముందు ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని అహోబిలం గ్రామంలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టిడిపి అభ్యర్థి అఖిల ప్రియ సోదరి మౌళిక కారుపై ప్రత్యర్థులు రాళ్లు రువ్వారు.