ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ టోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు. శుక్రవారం దుబాయ్లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ విన్ అవగా.. ఆ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ తొడకు గాయం అయింది. దీంతో అతను టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఫాంలో ఉన్న భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ కు దూరమవడం హైదరాబాద్కు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.
తొడ గాయం కారణంగా భువీ ఇకపై పలు మ్యాచ్లు ఆడలేడని, అందుకనే ఐపీఎల్ మొత్తానికీ దూరమవుతున్నాడని హైదరాబాద్ టీంకు చెందిన సభ్యుడు ఒకరు తెలిపారు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు పేస్ బౌలింగ్ కు నాయకత్వం వహిస్తున్న భువీ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇకపై అతని స్థానంలో ఎవరు జట్టును పేస్ బౌలింగ్లో నడిపిస్తారోనని జట్టు సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
కాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో భువీ 19వ ఓవర్లో బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ తొడ గాయం కారణంగా అసలు ఏమాత్రం పరుగెత్తలేకపోయాడు. దీంతో ఫిజియో వచ్చి అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. అయితే ఐపీఎల్ టోర్నీ ముగిశాక భారత్ ఆస్ట్రేలియాకు పర్యటించాల్సి ఉంది. అక్కడ 4 టెస్టులు, టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్లకు భువీ అందుబాటులోకి వస్తాడా, రాడా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.