Big Breaking: కరోనా టీకాల విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్రం నుండి సాధించేందుకు అందరం ఒక కట్టుగా ఉండాలన్నట్లు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు అందరు సీఎంలు ఒకే మాట మీద ఉండాలని జగన్ విజ్ఞఫ్తి చేశారు. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరం కలిసి కోరదామని జగన్ అన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని పేర్కొన్న జగన్.. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు పరస్పర సహాకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.
ఓ పక్క వ్యాక్సిన్ పాలసీపై సుప్రీం కోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుబడుతోంది. ఈ తరుణంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటి వరకూ కేంద్రంతో అనుకూల వైఖరితో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చలకు దారి తీస్తోంది.
కేరళ సీఎం పినరయి విజయన్ కు సీఎం జగన్ రాసిన లేఖ పూర్తి పాఠం కొరకు కింద లింక్ ను క్లిక్ చేయండి..