Big Breaking: మూడు రాజధానుల అంశంపై ఏపి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది ఏపి సర్కార్. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే తాజాగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతోందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఏపి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయడం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయాలనీ, మూడు రాజధానుల ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. రాజధానికి సంబంధించి చట్టాలను చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదని హైకోర్టు పేర్కొనడాన్ని ఆ నాడు ఏపి సర్కార్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసింది. శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యంపై అసెంబ్లీలో పెద్ద చర్చే జరిగింది.
ఆనాడు మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ మెరుగైన బిల్లు తీసుకువస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా చెప్పారు. త్వరలో అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తామనీ, వచ్చే ఏడాది నుండి విశాఖ పరిపాలనా రాజదానిగా కొనసాగుతుందని రీసెంట్ గా మంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. మరో పక్క అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి మహా పాదయాత్ర చేస్తున్నారు.
ఈ తరుణంలో మూడు రాజధానుల అంశంపై ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్టు తీర్పుపై మద్యంతర ఉత్తర్వులు (స్టే) ఇవ్వాలని ఏపి సర్కార్ సుప్రీం కోర్టును కోరినట్లు తెలుస్తొంది. ఈ పిటిషన్ పై త్వరలో సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. అయితే మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించి ఆయిదు నెలలు దాటిన తర్వాత సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ సవాల్ చేయడం సంచలనంగా మారింది.