Big Breaking: విభజన హామీల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. జనవరి 12వ తేదీన ఢిల్లీలో చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. విభజన హామీలను పరిష్కరించాలని ఎప్పటి నుండో ఏపి ప్రభుత్వం కోరుతోంది. ఏపి, తెలంగాణకు సంబంధించి ఆస్తుల పంపకాలతో జల వివాదాలు, విద్యుత్ బకాయిలు ఇలా అనేక అంశాలు ఉన్నాయి.
ఏపి, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి దాదాపు 8 సంవత్సరాలు కావోస్తున్నది. ప్రధాన హామీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. గత ప్రభుత్వంలో ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందున ప్రత్యేక ప్యాకేజీ నిధులను విడుదల చేస్తున్నామని ఇప్పటికే కేంద్రం చెప్పింది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి విభజన హామీల పరిష్కారానికి కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. తాజాగా కేంద్రం విభజన హామీల పరిష్కారానికి చర్యలు చేపట్టడం శుభ పరిణామంగా భావిస్తున్నారు.