Big Breaking : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణని సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే రెండు దశల్లో విచారణ జరిపిన సీబీఐ అధికారులు నిన్నటి నుండి మూడో దశ విచారణ ఆరంభించారు. దీనిలో భాగంగా అనుమానితుల వేట, విచారణ జరుపుతున్నారు. వివేకానందరెడ్డి కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని ఈరోజు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఢిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. దీనికి ముందు అతని తల్లిదండ్రులు హాజీవలి, మస్తానమ్మలను పులివెందులలో విచారించారు. వారిని కూడా వేర్వేరుగా విచారణకి తీసుకెళ్లారు. మస్తానమ్మని పులివెందులలో విచారించగా… హాజీవళిని అనంతపురం జిల్లా కదిరి తీసుకెళ్లారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు దస్తగిరిని లోతైన విచారణ నిమిత్తం ఢిల్లీ తీసుకెళ్లారు.
Big Breaking: ఇది మూడో దశ..! మొదటి రెండు దశల్లో ఇలా..!!
ఈ కేసులో సీబీఐ విచారణ ఇది మూడో దశ. గత ఏడాది జులై నెలలో 15 రోజుల పాటూ విచారించారు. దాదాపు 30 మందిని ప్రశ్నించారు. తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి.. మళ్ళీ సెప్టెంబర్ నెలలో విచారించారు. పులివెందులలో చెప్పుల దుకాణం నడిపే మున్నా.. సహా కీలక అనుమానితులను ప్రశ్నించారు. ఈ విచారణకు ఆకస్మికంగా ఆపేసి.. పోలీసు విచారణ నివేదిక ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ నివేదిక అందిన తర్వాత.. తాజాగా మళ్ళీ మూడో దశలో విచారణ మొదలు పెట్టారు. ఇప్పుడు సీబీఐపై కొంత ఒత్తిడి నెలకొంది. వివేకా కుమార్తె సునీత ఢిల్లీ స్థాయిలో మీడియా ముఖంగా ప్రశ్నిస్తుండడం.. ఏపీలో విపక్షాలు కూడా దీన్ని ఇష్యూ చేస్తుండడం.. ఒక రాజకీయ వివాదాస్పద అంశంగా మారడంతో సీబీఐపై కొంత ఒత్తిడి నెలకొంది..!!