కరోనా నేపథ్యంలో టెకీలు అందరికీ వర్క్ ఫ్రం హోమ్ సౌలభ్యాన్నిచ్చాయి కంపెనీలు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే బెంగళూరు, హైదరాబాద్ నగరాలన్నీ టెకీలు లేక వెలవెలబోతున్నాయి. అందరూ సొంతూళ్లు వెళ్లిపోయి ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఎక్కువ అద్దెలు చెల్లించలేని పరిస్థితి. ఇళ్లకు తాళాలేసి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. అసలే.. ఆరు నెలలకు పైగా అడ్వాన్సులు ఇచ్చి వేలకు వేలు అద్దెలు కట్టాలి.
ఈ పరిస్థితుల్లో వారికి స్టోరేజ్ హౌస్ లు మధ్యే మార్గంలా కనిపిస్తున్నాయి. సేఫ్ స్టోరేజి, స్టోరేజియన్ప్, స్టోనెస్ట్ స్టోరేజ్, ఆరెంజ్ సేఫ్ స్టోరేజ్, మై రక్ష వంటి సంస్థల సేవలు ఇప్పుడు టెకీలకు వరంలా మారుతున్నాయి. కొన్నాళ్లపాటు విదేశాలకు వెళ్లేవారు తమ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకునేందుకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని కంపెనీలు కూడా తమ సామాగ్రిని భద్రపరచుకునేందుకు వీటిని ఉపయోగిస్తాయి. ఇప్పుడు టెకీలు సొంతూళ్లకు వెళ్లారు. ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ వస్తువులను స్టోరేజ్ హౌస్ లలో దాచుకుంటున్నారు.
‘డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కు 24వేల అద్దె చెల్లిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరు నుంచి కన్నూరుకు వెళ్లిపోయాను. ఇప్పుడు అద్దె చెల్లించడం వేస్ట్. స్టోరేజ్ హౌస్ లో నా సామాను దాచుకున్నాను. అద్దె కేవలం రూ. 2891. ఇదెంతో సౌలభ్యంగా ఉంది’ అని ఓ టెకీ అంటున్నాడు. ‘నాకు 1.16 లక్షల స్క్వేర్ ఫీట్ తో 13 వేర్ హౌస్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ తో మరిన్ని తీసుకుంటున్నాం’ అని సేఫ్ స్టోరేజ్ కో-ఫౌండర్ రమేశ్ అంటున్నడు.