గత కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊపరి సలపనివ్వకుండా మారిపోయిన ఉదంతంలో ఉపశమనం దొరికింది. ఏపీకి వరప్రదాయిని అనే పేరున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పోలవరం బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి స్పందన వచ్చింది. పోలవరం బకాయిల విడుదలకు మార్గం సుగమమం అయింది.
పోలవరంపై పెద్ద రిలీఫ్
పోలవరంపై గత కొద్దికాలంగా నెలకొన్న ఉత్కంఠకు తాజాగా రిలీఫ్ దొరికింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. కేంద్ర జలశక్తి శాఖకు ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మెమో పంపించింది. రూ. 2234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆర్థిక శాఖ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తిచేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ మెమో ద్వారా సమాచారం అందించింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల సమస్యలో పెద్ద రిలీఫ్ వచ్చినట్లయింది.
ఇంకో కీలక సమావేశం
ఇదిలాఉండగా, హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం సందర్భంగా…. వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులు అథారిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో సమావేశమయ్యారు. సమావేశంలో అథారిటీ సభ్యులు హాజరై ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి… నిధుల మొత్తాన్ని కేంద్రమే భరించాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణం చేపడతామని కేంద్రం తెలిపిందని చెప్పారు. 2013-14 అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని చెప్పడంతో ఏపీ ప్రజలపై పిడుగు పడినట్లయిందని అన్నారు. పూర్తి నిధులు ఇవ్వకపోతే 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు.
కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు
పోలవరం ప్రాజెక్టు పరిధిలో బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు లేఖ రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం విషయంలోనూ… తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఇందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ ప్రతిపాదనను కేంద్ర జలశక్తిశాఖకు విన్నవిస్తామని చెప్పినట్టు వెల్లడించారు. ముంపుపై తెలంగాణ అభ్యంతరాలు పెద్ద ఇష్యూ కాదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ను నింపినప్పుడు సమస్య వస్తే అప్పుడే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.