త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది.ఈ సమస్య ని ఎలా పరిష్కరించాలా అని ముఖ్యమంత్రి తనయుడు తర్జనభర్జన పడుతున్నారట.
హైదరాబాద్ మహా నగరంలో ఉన్న ఓపెన్ నాలాలు ప్రజల ప్రాణాలను కబళిస్తున్నాయి.హైదరాబాద్లో రెండు గంటలు వర్షాలు పడితే.. రోడ్లన్నీ పొంగి పొర్లుతాయి. ఆ నీరంతా నాలాల ద్వారా బయటకు పోవాలంటే.. కనీసం రెండు గంటలు పడుతుంది. ఆ రెండు గంటల సమయంలో.. ఆ నీటితో పాటు మనుషులూ కొట్టుకుపోతున్నారు. వారం వ్యవధిలో ఇలా ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయి. మృతి చెందారు.ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న సుమేధ అనే బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.నేరెడ్మెంట్లో నాలాకు బలైన చిన్నారి సుమేధ తల్లిదండ్రులు.. తమ పాప మృతికి మంత్రి కేటీఆర్ తో పాటు… అధికారులు, ప్రజాప్రతినిధులు కారణం అని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా ఎవరూ పోలీసులు దాకా వెళ్లలేదు. ఇప్పుడు సుమేధ తల్లిదండ్రులు ఆ ధైర్యం చేయడంతో మంత్రులు అధికారులు తలలుపట్టుకుంటున్నారు.ప్రతీ ఏడాది వర్షాకాలంలో నాలాలకు ఒకరో ఇద్దరో బలవ్వకుండా ఉండరు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా.. అధికారులు హడావుడి చేస్తారు. నాలాను మ్యాపింగ్ చేస్తామని.. మూసేస్తామని.. మళ్లీ జరగకుండా చేస్తామని చెబుతూ ఉంటారు. కానీ మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. ఆ నల్లాలను మూసేయడమే జరగదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారాలనుకున్న సుమేథ తల్లిదండ్రులు… మరొకరు బలి కాకుండా.. ధైర్యంగా ముందడుగు వేశారు. కేటీఆర్, మేయర్, కమిషనర్, కార్పొరేటర్లందరిపై ఫిర్యాదు చేశారు. సుమేధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజకీయ దుమారం కూడా రేగింది.
వెంటనే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అంది పుచ్చుకున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో సరిగ్గా స్పందించకపోతే ప్రజాగ్రహాన్ని గురికాగలదు.పైగా గ్రేటర్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి .ఈ ఎన్నికలకు ముందు కేటీఆర్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. రెండు ప్రాణాలు పోయిన తర్వాత ఆయన మరింతగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉందన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించటం కెటిఆర్ మీదున్న పెద్ద బాధ్యత.అందువల్ల ఆయన అన్ని విధాల అతలా కుతలమవుతున్నారట. ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న కెటిఆర్ ఈ సంక్షోభం నుండి ఎలా బయటకొస్తాడో చూద్దాం!