గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా వైకాపా లో విజయసాయి రెడ్డిపై రకరకాల రూమర్స్ బయటకు వస్తున్నాయి. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సమయంలో సీఎం జగన్ వైజాగ్ వెళ్తూ ఆయన్ను కారు నుంచి సాయిరెడ్డిని దింపేశారని సంచలన వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రోటోకాలే దానికి కారణం అని క్లారిటీ వచ్చినా.. నాటి నుంచీ విజయసాయి వ్యవహారంపై రకరకాల వార్తలొస్తున్నాయి. అనంతరం ఎవరూ అడగకుండానే… ప్రాణం పోయే వరకూ జగన్ తోనే అని సాయిరెడ్డి ప్రకటించడం కూడా కొంత అనుమానాలకు తావిచ్చింది.
ఈ క్రమంలో మరోసారి విజయసాయి ప్రాధాన్యత మరింత తగ్గబోతోంది అనే మరో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి కారణం తాజాగా పూర్తయిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారం. వైకాపా తరుపున విజయసాయి ఇప్పటి వరకు పార్లమెంటరి పార్టీ నేతగా ఉన్నారు. ఇప్పుడు నలుగురు కొత్త రాజ్యసభ సభ్యులు కూడా వచ్చి చేరారు. ఈ తరుణంలో జగన్ కి అత్యంత నమ్మకస్తుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభలో అడుగు పెట్టారు. దాంతో… ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కే పార్లమెంటరి పార్టీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది!
ఇటీవల వైసీపీలో పదవులు అన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తున్నారని విమర్శలొస్తున్న తరుణంలో… ఇప్పుడు ఆ అపవాదను చేరిపేసుకునే పనుల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఈ కీలకపదవి ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం సాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గినట్టే అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి!