Counterfeit Kallu: కొంత మంది చాలా తెలివిగా నేరం చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తాము చేసిన నేరం వెలుగు చూడదు. సేఫ్ గా ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తే నేరం చేసిన వాడు ఎలాగైనా దొరికి పోతాడు అని ఈ ఘటన రుజువు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఇటీవల కల్తీకల్లు తాగడం వల్ల అయిగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అటు ఎక్సైజ్, ఇటు సివిల్ పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయగా ఓ కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి హత్య కోసం జరిగిన కుట్రకు అయిగురు బలి అయ్యారు అని దీనికి ఓ వ్యక్తి అక్రమ సంబంద వ్యవహారం కారణం అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
Counterfeit Kallu: జీలుగ కల్లు శాంపిల్స్ లో క్రిమి సంహారక మందు
కల్లు తాగి అయిదుగురు గిరిజనులు మృతి చెందడంతో తొలుత కల్తీ కల్లు అని అందరూ భావించారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపాయి. అయిదుగురు మృతి చెందడానికి కారణమైన జీలుగ కల్లు శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం కాకినాడలోని ఎక్సైజ్ శాఖ ప్రాంతీయ పరీక్షా కేంద్రానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కల్లులో క్రిమి సంహారక మందు కలిసినట్లు నిపుణులు గుర్తించారు. దీంతో ఆ శాంపిల్స్ ను ఫొరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపించారు. సాధారణంగా జీలుగ కల్లు తాగితే వ్యక్తులు చనిపోయే అవకాశం ఉండదు. దీని వెనుక ఎదో కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజం అయ్యింది. ఫొరెన్సిక్ రిపోర్టులోనూ క్రిమిసంహారక మందు కలిసినట్లు రిపోర్టు వచ్చింది.
ఒక వ్యక్తిని చంపేందుకు కుట్ర చేసి..
దీంతో ఈ కల్లులో క్రిమిసంహారక మందు కలపడానికి కారకులు ఎవరు ? ఎందుకు చేశారు ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరిపారు. మృతుల వివరాలు మొత్తం తీసుకుని వారిలో ఎవరికైనా గొడవలు ఉన్నాయా ? వాళ్లను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ? తదితర విషయాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతుల్లో ఒకరైన గంగరాజు భార్యతో రాంబాబు అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాంబాను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా నిజాన్ని అంగీకరించాడు. గంగరాజును చంపేందుకు రాంబాబు జీలుగ కల్లులో గడ్డి మందు కలపాడనీ, అ విషయం తెలియక గంగరాజుతో కలిసి కల్లు తాగిన మిగిలిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారని దర్యాప్తులో తేలింది. అయిదుగురు మృతికి కారణమైన రాంబాబును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.