బిగ్ బాస్ 4సీజన్ ముగిసిపోయింది.గ్రాండ్ ఫినాలే గత ఆదివారం జరిగింది.అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా ఆ షో యాంకర్ కింగ్ నాగార్జున కార్యక్రమాన్ని రక్తికట్టించారు.
అయితే ఇదంతా జరిగి పైవారు రోజులయ్యాక నాగార్జున పై దుమారం రేగింది.అది కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడు నాగార్జునను టార్గెట్ చేయటం సంచలనం రేపుతోంది.సీపీఐ నారాయణ ఈ తేనెతుట్టెను కదిలించారు.వివరాల్లోకి వెళితే .. ప్రముఖ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో కేసు వేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బిగ్ బాస్ షో లో నాగార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నారాయణ ఆరోపించారు.
ఇది తీవ్ర అభ్యంతరకరం!
ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఎవరిని కిస్ చేస్తావు.. ఎవరితో డేటింగ్ చేస్తావు… ఎవరిని పెళ్లి చేసుకుంటావంటూ ఒక యువకుడిని ప్రశ్నించడం చాలా దారుణమన్నారు. ఈ విషయంపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు.అక్కినేని నాగార్జున అంటే తనకు అభిమానం, ఆయన సినిమాలు చూస్తా కానీ ఆయన ఎంత దరిద్రం పని చేశారని మండిపడ్డారు. మహిళా లోకానికి నాగార్జున అన్యాయం చేశారని తెలిపారు.
మహిళా లోకాన్ని కించపరిచే చర్య!
బిగ్ బాస్ షోలో బహిరంగంగా మహిళలను కించే పరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. నాగార్జున ఇంట్లో కూడా సినిమా యాక్టర్స్ ఉన్నారు..మరి వాళ్ల బొమ్మలు పెట్టొచ్చుగా ఎందుకని అమాయకుల బొమ్మలు పెట్టారని ప్రశ్నించారు.ఈ పద్ధతిలో సినిమా యాక్టర్లకు వచ్చే పేరును మహిళా లోకానికి అన్యాయం చేస్తుంటే పోలీసు స్టేషన్ వెళ్లి కేసు పెడితే తీసుకోలేదన్నారు. స్థానిక కోర్టు, జిల్లా కోర్టులో కేసు వేస్తే తీసుకోలేదని..ఇప్పుడు హైకోర్టులో కేసు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనపై కేసులు తీసుకోవడానికి కోర్టులు భయపడుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాతృభూమిలో మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా అని నిలదీశారు. మహిళలను అన్యాయం చేసి మాట్లాడుతుంటే నాగార్జునకు కోట్లు రావొచ్చన్నారు.కానీ నాగార్జున సంస్కారవంతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఆయనపై న్యాయ పోరాటం చేయటం తప్పదని నారాయణ తేల్చి చెప్పారు.