పాట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మే 20వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది.
రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్ మోది పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 18వ తేదీన పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టేట్ కోర్టులో రాహుల్ గాంధీపై క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేశారు.
మోది అనే ఇంటి పేరు ఉన్న వారిని రాహుల్ గాంధీ అవమానించారని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 16వ తేదీన మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహులా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.
‘అదేంటో.. దొంగలంతా మోది ఇంటి పేరుతోనే ఉన్నారు’ అని రాహుల్ గాంధీ మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీపై బిహార్లో శనివారం మరో కేసు నమోదైంది. సమస్తిపుర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్ హై’ నినాదాన్ని పదే పదే ప్రజలతో చెప్పించారని న్యాయవాది సత్యవ్రత్ స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
రాహుల్తో పాటు సభకు హాజరైన ఆర్జెడి నేత తేజస్వీ యాదవ్, రెండు మీడియా ఛానళ్ల పేర్లను కూడా సత్యవ్రత్ ఫిర్యాదులో చేర్చారు. ఆ నినాదం చెప్పాలని ప్రజలను రాహుల్ గాంధీ కోరడంపై తాను తీవ్రమైన బాధకు గురయ్యాయని సత్యవ్రత్ తెలిపారు. దేశద్రోహం, ప్రజల్లో భయాన్ని కలగజేయడం వంటి సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేయాలని సత్యవ్రత్ కోరారు.